V6 News

అధిక లాభాల ఆశ చూపి రూ.కోటి వసూలు.. నిందితురాలి అరెస్ట్

అధిక లాభాల ఆశ చూపి రూ.కోటి వసూలు.. నిందితురాలి అరెస్ట్

ఆసిఫాబాద్, వెలుగు: అధిక లాభాలు వస్తాయని అమాయకులకు ఆశ చూపించి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసగించిన ముఠాలోని ఓ మహిళను పోలీసులు అరెస్ట్  చేశారు. శనివారం ఆసిఫాబాద్  జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ నితికా పంత్​ వివరాలు వెల్లడించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్‌‌నగర్  టౌన్  పోలీస్ స్టేషన్  పరిధిలో డివైన్  గ్రూప్  ఆఫ్  కంపెనీ పేరిట నకిలీ వ్యాపారం నిర్వహిస్తూ మోసం చేసిన కేసులో ఠాకూర్  శివరంజనిబాయిని అరెస్ట్  చేసినట్లు తెలిపారు.

నిందితులు పథకం ప్రకారం 5 శాతం నుంచి 20 శాతం వరకు లాభాలు వస్తాయని చెప్పి బాధితులను నమ్మించారని చెప్పారు. ఈ కేసులో హైదరాబాద్  లాలాగూడ, కాగజ్ నగర్  టౌన్, పెంచికల్ పేట్  పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులు ఉండగా, శివరంజని బాయిని అరెస్ట్  చేశామని, ఠాకూర్ కరణ్ సింగ్, ఠాకూర్  రతన్ సింగ్, ఠాకూర్  రవీందర్  అలియాస్​ లడ్డూ సింగ్, ఠాకూర్  రాణా సింగ్  పరారీలో ఉన్నారని చెప్పారు. కాగజ్ నగర్  డీఎస్పీ వహిదుద్దీన్, కాగజ్ నగర్  టౌన్  ఇన్స్​పెక్టర్​ ప్రేమ్ కుమార్, ఎస్సై రాజును ఎస్పీ అభినందించారు.