ప్రియుడిపై కోపంతో ఓ ప్రియురాలు దాదాపు 150 అడుగుల ఎత్తున్న టవర్ ఎక్కింది. ఆమె ఒప్పించి కిందికి దించడానికి ప్రియుడు కూడా టవర్ ఎక్కాడు. దాదాపు ఆరగంట సేపు టవర్ పైనే ఇద్దరు మాట్లాడుకున్నారు. ప్రియుడు చెప్పిన మాటలకు కోపం తగ్గించుకున్న ప్రియురాలు టవర్ నుంచి కిందికి దిగింది. ఈ విషయం పోలీసులకు తేలియడంతో ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఇకపై అలా చేయవద్దని వారికి సూచించి వదిలేశారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ లో చోటుచేసుకుంది.
అనిత భైనా అనే యవతి.. ముఖేష్ భైనా గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏదో విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అనిత ఇంటి నుంచి బయటకు వెళ్లి పక్కనే ఉన్న టవర్పైకి ఎక్కింది. కొంతమంది గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని కిందికి దిగాలని ఆమెను కోరారు. విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు ముఖేష్ భైనా.. అక్కడికి చేరుకుని అతను కూడా టవర్ పైకి ఎక్కి ఆమెను కిందకు దించే ప్రయత్నం చేశాడు.
ఇద్దరు టవర్ పైనే కూర్చుని చాలా మాట్లాడుకున్నారు. చివరికి ప్రియుడు మాటలకు ఆ యువతి కిందికి దిగింది. ఇంతలో గ్రామస్తుల సమాచారంతో పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు . అయితే అనితకు అంతకుముందే పెళ్లి కాగా ఆమె తన భర్తతో విడివిడిగా జీవిస్తోంది. ఈ క్రమంలో ముఖేష్తో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది.