11 నెలల బిడ్డను తన చేతులతోనే చంపుకుని.. తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ టెకీ భార్య. తొలి ప్రెగ్నెన్సీ సమయంలో గర్భస్రావం కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఆ మహిళ లాక్ డౌన్ సమయంలో మరింత కుంగిపోయి ఈ దారుణానికి పాల్పడిందామె. భర్త ఇంట్లో ఉండి ఆఫీస్ వర్క్ చేసుకుంటుండగానే ఈ దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
భర్త కళ్ల ఎదుటే మూడో అంతస్తు పైనుంచి దూకి..
భోపాల్ లోని బైరాగఢ్ ప్రాంతానికి చెందిన యువకుడు పుణేలోని ఓ కంపెనీలో సాఫ్ట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తన భార్య, 11 నెలల కుమార్తెతో కలిసి పుణేలో ఉండేవాడు. గత నెలలో హోళీ పండుగ కోసం స్వస్థలానికి వెళ్లాడు. అయితే ఆ తర్వాత లాక్ డౌన్ కారణంగా తిరిగి పుణే వెళ్లలేకపోయారు. దీంతో అతడు బైరాగఢ్ లోని ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం తన రూమ్ లో కూర్చుని వర్క్ చేసుకుంటుండగా ఎవరూ తలుపుకొట్టినట్లు అనిపించి బయటకు వస్తే అక్కడ తన కూతురు నిర్జీవంగా పడి ఉందని తెలిపాడు. భార్య తన కళ్ల ఎదుటే పరిగెత్తుకుంటూ మెట్లవైపు వెళ్లిందని, తాను ఆపేలోపే మూడో అంతస్తులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు.
ఈ ఘటనపై ఆ టెకీ పోలీసులకు సమాచరం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అయితే ఆ మహిళకు తొలి ప్రెగ్నెన్సీలో గర్భస్రావం కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిందని ఆమె తల్లిదండ్రులు, భర్త పోలీసులకు తెలిపారు. ఇటీవల కొన్నాళ్లుగా తరచూ ఆమె మందులు సరిగా వాడకపోవడంతో మరింత కుంగిపోయి ఇలా జరిగి ఉండొచ్చని ఆమె భర్త చెబుతున్నాడు.