
- ప్రైవేటు క్లినిక్ ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన
- క్లినిక్కు తాళం వేయించిన డీఎంహెచ్వో
గచ్చిబౌలి, వెలుగు : జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఓ మహిళ ట్రీట్మెంట్ కోసం స్థానికంగా ఉన్న క్లినిక్కు వెళ్లగా.. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే చనిపోయింది. దీంతో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందంటూ కుటుంబసభ్యులు క్లినిక్ ఎదుట ఆందోళన చేశారు. ఈ ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన హీరాలాల్, కుసుమ్ (55) దంపతులు సిటీకి వలస వచ్చి చందానగర్లో ఉంటున్నారు. ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూలీ పని చేస్తున్నారు. రెండ్రోజులుగా కుసుమ్ జ్వరం, జలుబుతో
బాధపడుతోంది. దీంతో హీరాలాల్ ఆమెను దగ్గరలోని శ్రీ సాయి క్లినిక్కు తీసుకెళ్లాడు. కుసుమ్ను పరీక్షించిన డాక్టర్ జ్వరం తగ్గేందుకు ఇంజక్షన్ ఇచ్చాడు.
కొద్దిసేపటికే కుసుమ్ క్లినిక్లోనే ఒక్కసారిగా కుప్పకూలింది. డాక్టర్ పరిశీలించి ఆమె చనిపోయినట్లు చెప్పాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు డెడ్బాడీతో క్లినిక్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. హీరాలాల్ ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతి విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు శ్రీసాయి క్లినిక్కు తాళం వేయాల్సిందిగా డిప్యూటీ డీఎంహెచ్వో సృజనను ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.