రూ.52 ల‌క్ష‌లు చెల్లించినా ద‌క్క‌ని ప్రాణం

రూ.52 ల‌క్ష‌లు చెల్లించినా ద‌క్క‌ని ప్రాణం

ఆ దంప‌తులు ఇద్ద‌రూ డాక్ట‌ర్లే. క‌రోనా సోక‌డంతో ఆస్ప‌త్రి చేరి ట్రీట్ మెంట్ తీసుకుని ఆరోగ్యవంతులుగా బయటపడ్డారు. భర్త పూర్తిగా కోలుకున్నా.. భార్య‌కు క‌రోనా తర్వాత అనారోగ్య స‌మ‌స్య‌లు వచ్చాయి. దీంతో వైద్యం కోసం ఓ కార్పొరేట్ ఆస్ప‌త్రిలో చేరారు. ఆ ఆస్పత్రి నిర్వాహకులు రూ.52ల‌క్ష‌ల బిల్లు వ‌సూలు చేశారు. అడినంతా చెల్లించినా.. ఆస్ప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగానే త‌న భార్య మృతి చెందింద‌ని ఆమె భ‌ర్త ఆరోపిస్తూ.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో జ‌రిగింది.

కొంపల్లికి చెందిన చెందిన డాక్టర్‌ భావన(31)కు 15 నెలల కిందట అదే ప్రాంతానికి చెందిన డాక్టర్‌ కల్యాణ్‌తో మ్యారేజ్ అయ్యింది. భావ‌న పెళ్లికి ముందు బేగంపేటలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో రేడియాలజిస్టుగా ప‌ని చేశారు. అయితే.. పెళ్లి తర్వాత ఆమె త‌న వృత్తికి దూరంగా ఉంటోంది. అయితే.. ఏప్రిల్ లో కరోనా బారినపడటంతో కిమ్స్ ఆస్ప‌త్రిలో చేరి.. మ‌హ‌మ్మారిని జ‌యించారు. క‌రోనా నుంచి కోలుకున్న తర్వాత ఆమెకు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. ఎక్మో అవ‌స‌రం కావ‌డంతో జూబ్లీహిల్స్‌లోని కార్పొరేట్ ఆస్ప‌త్రిలో చేరారు.

26 రోజులుగా అక్క‌డ చికిత్స పొందుతున్నారు. మ‌రో వారం రోజుల్లో  భావను ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేస్తామ‌ని డాక్టర్లు చెప్పార‌ని ఆమె భ‌ర్త క‌ల్యాణ్ చెప్పారు. అయితే.. బుధ‌వారం ఆమెకు అమ‌ర్చిన ఎక్మో పైపు స‌రిగ్గా లేక రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం కారిపోయినా ఆస్పత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఎక్మో సాయంతో ఆమె ఆక్సిజన్‌ స్థాయి 94గా ఉండగా పైపు డ్యామేజ్ కారణంగా 64కు పడిపోయిందని.. ఆ తర్వాత ఫ్లూయిడ్‌ ఓవర్‌లోడ్‌ చేయడంతో గురువారం వేకువజామున ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయిందని ఆమె భర్త డాక్టర్ కల్యాణ్ తెలిపారు. అంతేకాదు ఆస్ప‌త్రి బిల్లు రూ.52 లక్షలు చెల్లించామ‌ని.. సిబ్బంది నిర్లక్ష్యం కార‌ణంగానే త‌న‌ భార్య ప్రాణాలు కోల్పోయింది కల్యాణ్ ఆరోపిస్తున్నారు.

దీనిపై స్పందించిన ఆస్ప‌త్రి వ‌ర్గాలు.. డాక్టర్లు, వైద్య సిబ్బంది వైఫ‌ల్య‌మేమీ లేద‌ని, విష‌మ ప‌రిస్థితిల్లో ఉన్న ఆమెను బ‌తికించ‌డానికి అన్ని ప్ర‌య‌త్నాలు చేశామ‌న్నారు. అయినా ఫ‌లితం లేక‌పోయింద‌న్నారు.