- జగిత్యాల జిల్లా నగునూరు పంచాయతీ ఆఫీస్ వద్ద మహిళ నిరసన
జగిత్యాల, వెలుగు : ‘కార్యదర్శి సార్.. ఇదిగోండి మీరు అడిగిన రూ. 50 వేలు. ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు, కావాలంటే లెక్కపెట్టుకోండి. ఇప్పుడైనా మా పని చేయండి మీకు దండం పెడతా’ అంటూ ఓ మహిళ గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద నిరసన తెలిపింది.
బాధిత మహిళ, జగిత్యాల జిల్లా నగునూర్ గ్రామానికి చెందిన రేంగుంట గంగమ్మ మాట్లాడుతూ.. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, బిల్లు కోసం ఇంటి ఫొటోలు అప్లోడ్ చేసేందుకు విలేజ్ సెక్రటరీ అరీఫొద్దీన్ రూ. 50 వేలు డిమాండ్ చేశారని ఆరోపించింది. గతంలో భూమి మార్పిడి సమయంలోనూ రూ. 30 వేలు లంచం తీసుకున్నారని వాపోయింది. ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న తనకు ప్రభుత్వం ఇల్లు ఇస్తే.. కార్యదర్శి మాత్రం లంచం కోసం వేధిస్తున్నారని, చివరకు అప్పు తెచ్చి మరీ డబ్బులు ఇస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

