
న్యూఢిల్లీ: ఎయిర్ పోర్టులో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఓ వ్యక్తికి సీపీఆర్ (కార్డియోపల్మొనరీ రిసరెక్షన్) చేసి ప్రాణాలు కాపాడిందో మహిళ. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 2 వద్ద బుధవారం జరిగింది. ఎయిర్పోర్ట్లోని ఫుడ్ కోర్ట్ వద్ద ఓ 60 ఏండ్ల వ్యక్తి అకస్మాత్తుగా హార్ట్ అటాక్ రావడంతో కుప్పకూలిపోయాడు.
అక్కడే ఉన్న ఓ మహిళ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయనకు సీపీఆర్ చేయడం మొదలు పెట్టింది. గుండెపై బలంగా నొక్కుతూ సీపీఆర్ చేసింది. ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చే వరకు అలాగే చేసింది. కొద్ది సేపటి తర్వాత ఆ వ్యక్తికి స్పృహ రావడంతో ఎయిర్పోర్ట్ హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది.
ఆమె చేసిన పనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సీపీఆర్ చేయకుండా ఏమాత్రం ఆలస్యం చేసినా ఆ వ్యక్తి ప్రాణాలు దక్కేవి కావని సకాలంలో ఆమె స్పందించిందని మెచ్చుకుంటున్నారు.