బీఆర్ఎస్​ వాళ్లకే పట్టాలిస్తరా?  మేమేం పాపం చేసినమ్​ సార్​?

బీఆర్ఎస్​ వాళ్లకే పట్టాలిస్తరా?  మేమేం పాపం చేసినమ్​ సార్​?
  • బీఆర్ఎస్​ వాళ్లకే పట్టాలిస్తరా? మేమేం పాపం చేసినమ్​ సార్​?
  • ఇండ్ల స్థలాల పట్టాలపై కోరుట్ల ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు 
  • అనర్హులకు ఇస్తున్నారంటూ చుట్టుముట్టి ఆగ్రహం 
  • మళ్లీ గ్రామసభ పెట్టి అర్హులను ఎంపిక చేస్తామన్న ఎమ్మెల్యే  


మెట్ పల్లి, వెలుగు : ‘మేమంతా కూలి పనులు చేస్తూ కిరాయి ఇండ్లల్లో ఉంటున్నం. 2005లో ఇందిరమ్మ ఇండ్ల కోసం జాగ కొన్నరు. 18 ఏండ్లుగా ఇండ్లిస్తరని చూస్తుంటే ఇప్పుడు ఆ భూమిలో మాకు పట్టాలివ్వకుండా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తరా? ఇదెక్కడి న్యాయం? మేము అర్హులం కాదా ఎమ్మెల్యే సాబ్’ అంటూ జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం కోనరావుపేట మహిళలు వెల్లుల్లలో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును నిలదీశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

మండలంలోని కోనరావుపేటలో ఇండ్లు లేని పేదలకు ఇండ్లు కట్టియ్యాలని 2005లో అప్పటి ఎమ్మెల్యే కొమొరెడ్డి రాములు హయాంలో 5 ఎకరాల 36 గంటల భూమి కొని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. కొన్ని కారణాలతో ఇండ్లను నిర్మించలేదు. దీంతో ఇండ్లు లేని పేదలకు భూమిని కేటాయించాలని గ్రామస్తులు ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసారగ్​రావు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన రెవెన్యూ ఆఫీసర్లతో మాట్లాడి స్థలాలు ఇవ్వడానికి నిర్ణయించారు. 

221 మంది పేదలు అప్లై చేసుకోగా, 115 మందిని ఆఫీసర్లు అర్హులుగా ప్రకటించి పంచాయతీ వద్ద లిస్టు పెట్టారు. దీంతో తాము అర్హులైమనా లిస్టులో పేర్లు రాలేదని మహిళలు రెండు రోజుల కింద గ్రామపంచాయతీ వద్ద ఆందోళన చేశారు. శుక్రవారం వెల్లుల్ల శివారులో నిర్వహిస్తున్న సంక్షేమ సంబరాల ప్రోగ్రాంలో పట్టాలు పంపిణీ చేస్తున్నారని తెలుసుకుని వెళ్లి ఎమ్మెల్యేను నిలదీశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చారని, తామేం పాపం చేశామని ప్రశ్నించారు. దీంతో ఆయన సముదాయించడానికి ప్రయత్నించినా వినిపించుకోలేదు. మరో సారి గ్రామ సభ నిర్వహించి అర్హుల లిస్టు తయారు చేయాలని ఆర్డీవో వినోద్ కుమార్ ను ఆదేశించారు. అప్పటి వరకు పట్టాల పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మహిళలు వెళ్లిపోయారు.