
- 78 రన్స్ తేడాతో యూఏఈపై ఇండియా గెలుపు
దంబుల్లా: విమెన్స్ ఆసియా కప్లో ఇండియా టీమ్ సెమీస్ బెర్త్కు మరింత చేరువైంది. బ్యాటింగ్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (47 బాల్స్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 66), రిచా ఘోష్ (29 బాల్స్లో 12 ఫోర్లు, 1 సిక్స్తో 64 నాటౌట్) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన గ్రూప్–ఎ రెండో లీగ్ మ్యాచ్లో టీమిండియా 78 రన్స్ భారీ తేడాతో యూఏఈపై ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు పాయింట్లతో పాటు +3.298 నెట్ రన్రేట్తో హర్మన్సేన గ్రూప్లో టాప్ ప్లేస్లో నిలిచింది. టాస్ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 201/5 స్కోరు చేసింది. విమెన్స్ టీ20ల్లో ఇండియాకు ఇదే అత్యధిక స్కోరు.
ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ స్మృతి మంధాన (13) ఫెయిలైనా, షెఫాలీ వర్మ (18 బాల్స్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 37) మెరుగ్గా ఆడింది. అయితే రెండు బాల్స్ తేడాలో షెఫాలీ, హేమలత (2) ఔట్కావడంతో ఇండియా 52/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో హర్మన్, జెమీమా రోడ్రిగ్స్ (14) నాలుగో వికెట్కు 54 రన్స్ జత చేసి ఇన్నింగ్స్ను ఆదుకున్నారు. 106/4 వద్ద వచ్చిన రిచా ఆకాశమే హద్దుగా చెలరేగింది. భారీ హిట్టింగ్తో ఫోర్లు, సిక్స్లు దంచింది. హర్మన్ కూడా అండగా నిలవడంతో ఐదో వికెట్కు 45 బాల్స్లోనే 75 రన్స్ జతయ్యాయి. లాస్ట్ ఓవర్లో హర్మన్ ఔటైనా, పూజా వస్త్రాకర్ (0 నాటౌట్)తో కలిసి రిచా ఆరో వికెట్కు 5 బాల్స్లో 20 రన్స్ జోడించడంతో ఇండియా భారీ స్కోరు చేసింది.
బౌలర్లు అదుర్స్..
ఛేజింగ్లో యూఏఈ 20 ఓవర్లలో 123/7 స్కోరుకే పరిమితమై ఓడింది. కావిషా (40 నాటౌట్), ఓపెనర్ ఇషా ఓజా (38) మాత్రమే ఆకట్టుకున్నారు. ఇండియా బౌలర్లు రెండు వైపుల నుంచి ఒత్తిడి పెంచడంతో మిగతా బ్యాటర్లు రన్స్ చేయలేకపోయారు. తీర్థ సతీశ్ (4), రినిత రజిత్ (7), సమైరా (5), కుషి శర్మ (10), హీనా (8), రితికా రజిత్ (6)ను స్వల్ప స్కోరుకే ఔట్ చేశారు. ఓజా, కావిషా నాలుగో వికెట్కు జోడించిన 40 రన్సే అత్యధిక భాగస్వామ్యం. దీప్తి 2 వికెట్లు తీసింది. రిచాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక వేలి గాయంతో స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ టోర్నీకి దూరం కావడంతో ఆమె ప్లేస్లో తనుజా కన్వర్ను ఇండియా టీమ్లోకి తీసుకున్నారు.