మహిళల అక్షరాస్యత పెంచాలి : బండారు దత్తాత్రేయ

మహిళల అక్షరాస్యత పెంచాలి :   బండారు దత్తాత్రేయ

ముషీరాబాద్,వెలుగు: మహిళల అక్షరాస్యత పెంచినప్పుడే దేశంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని హర్యానా  గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మహిళ ఎక్కడ ఉంటే అక్కడ ప్రగతి ఉంటుందని,   వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచిపోయే విధంగా  33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చారని తెలిపారు. 

అఖిల భారతీయ క్షత్రియ మహాసభ- జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం బాగ్ లింగంపల్లి  ఆర్టీసీ కళాభవన్ లో మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాజ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా బండారు దత్తాత్రేయ హాజరై మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని, ఈ వర్గానికి చెందిన మహారాణా ప్రతాప్ లాంటి యోధులు స్వాతంత్ర్యం కోసం త్యాగాలను చేయడంతోపాటు దేశ ప్రతిష్టకు ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. 

యువత ఉద్యోగాలు పొందడమే కాకుండా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆయన సూచించారు. భారత క్షత్రియ అధ్యక్షుడు, యూపీ వ్యవసాయ శాఖ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. క్షత్రియ సమాజం ఐకమత్యంగా ఉంటూ సంఘటితంగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ మంత్రి గుల్ చైన్ సింగ్ చరక్, మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ హరేంద్ర పాల్ సింగ్,  తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ ఠాకూర్ శక్తి సింగ్, మహాసభ దక్షిణ భారత్ ఇన్ చార్జి ఠాకూర్ విజయ్ సింగ్ బైస్ తదితరులు  పాల్గొన్నారు.