
గ్వాంగ్జూ (సౌత్ కొరియా): వరల్డ్ ఆర్చరీ చాంపియన్షిప్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కాంపౌండ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో నిరాశ పరచగా.. వెటరన్ దీపిక కుమారి నేతృత్వంలోని ఇండియా విమెన్స్ రికర్వ్ టీమ్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. దీపిక, యంగ్ స్టర్ గథా ఖడకే, అంకితా భకత్తో కూడిన జట్టు సెమీఫైనల్లో జపాన్ చేతిలో ఓడిపోయి కాంస్యం కోసం సౌత్ కొరియాతో తలపడనుంది.
మంగళవారం (సెప్టెంబర్ 09) క్వాలిఫికేషన్లో ఇండియా మూడో స్థానంలో నిలిచి, నేరుగా రెండో రౌండ్కు అర్హత సాధించింది. ఆ రౌండ్లో ఇండియా 5–1తో పదో సీడ్ స్లోవేనియాను ఓడించింది. క్వార్టర్స్లో6–-2తో బలమైన టర్కీపై నెగ్గింది. కానీ, సెమీఫైనల్లో 2–6తో జపాన్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు, ఇండియా మెన్స్ రికర్వ్ జట్టు నిరాశ పరిచింది.
నీరజ్ చౌహాన్, బొమ్మదేవర ధీరజ్, రాహుల్తో కూడిన తొమ్మిదో సీడ్ ఇండియా తొలి రౌండ్ షూటాఫ్లో 4–5తో 24వ సీడ్ డెన్మార్క్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. ఇంకోవైపు కాంపౌండ్ విభాగంలో ఇండియా పోరాటం ముగిసింది. సీనియర్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ, పర్నీత్ కౌర్, పృథికా ప్రదీప్ పతకాలు సాధించలేకపోయారు.
20 ఏండ్ల పర్నీత్ కాంస్య పతక పోరులో 144–-145తో కొలంబియాకు చెందిన అలెజాండ్రా ఉస్క్వియానో చేతిలో ఓడిపోయింది. అంతకుముందు క్వార్టర్స్లో 149–-147తో టీమ్మేట్ జ్యోతి సురేఖను ఓడించింది. దాంతో 2017 తర్వాత తొలిసారి సురేఖ వ్యక్తిగత పతకం లేకుండా వరల్డ్ చాంపియన్షిప్ను ముగించింది. 16 ఏండ్ల పృథిక ప్రి-క్వార్టర్స్లో 145–148తో ఎస్టోనియాకు చెందిన లిసెల్ జాట్మా చేతిలో ఓడిపోయింది.