
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వైరుధ్యాలు, విభేదాలు ఉన్నా అందరూ అంతిమంగా కోరుకునేది ప్రపంచ శాంతినే. తాజాగా హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు ఇదే సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రపంచ సుందరి పోటీలంటే కేవలం అందానికే పరిమితం కాదు, విశ్వశాంతిని, ఐకమత్యాన్ని చాటే వేదికగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సరిగ్గా ఈ పోటీలు ప్రారంభానికి ముందే ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.
వందకు పైగా ప్రపంచ దేశాల ప్రతినిధులు హైదరాబాద్లో ఉండగా దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఈ పోటీలను సజావుగా జరగనిస్తాయా అనే అనుమానాలు అందరిలో తలెత్తాయి. అవన్నీ పటాపంచలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు.. పటిష్టమైన భద్రత నడుమ నిరాటంకంగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు హైదరాబాద్ వేదికగా కొత్త ప్రపంచ సుందరి ప్రకటన ఉంటుంది.
నె లరోజుల పాటు 108 దేశాల ప్రతినిధులు హైదరాబాద్లోనే ఉంటూ తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పే క్షేత్ర పర్యటనలు చేయటం అరుదైన విషయమే. ఎక్కడా ఏ చిన్న లోపమూ తలెత్తకుండా చేసిన ప్రభుత్వ ఏర్పాట్లు అమోఘమనే చెప్పాలి. ఈ పోటీలు తెలంగాణ ప్రభుత్వ సమర్థత, అధికారుల అలుపెరగని కృషికి గీటురాయిగా నిలిచాయి. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ ఈవెంట్లు.. సమ్మిట్లకు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది.
‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదం విశ్వవ్యాప్తమైంది. మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని దాదాపు రెండు వేల మంది జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు కవర్ చేశారు. దేశ, విదేశీ ప్రతినిధులతో హైదరాబాద్లోని స్టార్ హోటళ్లన్నీ కిటకిటలాడాయి. ఇక్కడికి వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు హైదరాబాద్ కీర్తి ప్రఖ్యాతులు.. మన కట్టుబొట్టు.. సంప్రదాయం.. తెలంగాణ ఆతిథ్యాన్ని తమ తమ దేశాల్లో ప్రస్తావించనున్నారు. దీంతో వరల్డ్ లెవల్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ హబ్, టూరిజం డెస్టినేషన్గా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ప్రభుత్వ ఆకాంక్ష తీరినట్టే.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో మరే నగరానికి లేని అనుకూలతలు హైదరాబాద్కు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ఎలాంటి ఆటంకాలు లేని అనుమతులతోపాటు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. యువతకు ఉపాధి, పేదలకు సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తున్న ప్రభుత్వానికి హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్న అంతర్జాతీయ ఈవెంట్లు బలమైన టానిక్గా పనిచేస్తున్నాయి.
ఏఐ గ్లోబల్ సదస్సు సక్సెస్
గత ఏడాది సెప్టెంబర్ 5, 6 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం వరల్డ్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సును నిర్వహించింది. ప్రపంచం నలుమూలల నుంచి AI రంగంలో పేరొందిన ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు 2000 మంది ఈ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలిపేందుకు వ్యవసాయం, ఆరోగ్యం, విద్య ఇతర రంగాల్లో ఏఐ టెక్నాలజీ వినియోగించి, వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం 25 అంశాలతో కూడిన ఏఐ రోడ్మ్యాప్ విడుదల చేసింది. ఇదే వేదికగా ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
గ్లోబల్ రైస్ సమ్మిట్
గత ఏడాది రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ రైస్ సమ్మిట్ విజయవంతమైంది. దీని ద్వారా తెలంగాణ బియ్యాన్ని ప్రధానంగా ఫిలిపైన్స్, అమెరికా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే వంటి దేశాలకు ఎగుమతి చేసే అవకాశం వచ్చింది. బియ్యం ఎగుమతులను మరింత విస్తరించటానికి ఇండియన్, వరల్డ్ బిజినెస్మెన్ అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ఈ సమ్మిట్ ఒక వేదికగా ఉపయోగపడింది. ఇక భారత పరిశ్రమల శాఖ (సీఐఐ), ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఆధ్వర్యంలో హైటెక్స్లో మూడు రోజులు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించారు. దీనికి కూడా పెద్ద సంఖ్యలో విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు.
వింగ్స్ఇండియా 2024 ఏవియేషన్
గత సంవత్సరం బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ కార్యక్రమం మూడు రోజులపాటు కొనసాగింది. ప్రపంచస్థాయి సంస్థలు, వాటి ప్రతినిధులు ఈ ఈవెంట్ కోసం హైదరాబాద్ను సందర్శించారు. ఇంటర్నేషనల్ ఏవియేషన్ హబ్గా బెంగళూరును వెనక్కినెట్టి హైదరాబాద్ అవతరించే రోజు ఎంతోదూరం లేదని ఆ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు.
బయో ఏషియా సదస్సు
ఏడాదికోసారి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే బయో ఏషియా సదస్సును వరుసగా రెండేండ్లు హైదరాబాద్లో అత్యంత విజయవంతంగా నిర్వహించారు. 50 దేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రతినిధులు హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తమ కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించి ఆలోచన పంచుకున్నారు. నోబెల్ పురస్కార గ్రహితలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బిజినెస్ టు బిజినెస్ మీటింగ్లతో హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లున్న లైఫ్ సైన్సెస్ సంస్థలు కన్సార్టియంగా పని చేసేందుకు ముందుకువచ్చాయి.
భారత్ సమ్మిట్ 2025
హైదరాబాద్లో భారత్ సమ్మిట్ 2025 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుతో నిర్వహించిన అంతర్జాతీయ రాజకీయ సదస్సు రెండు రోజులపాటు ఘనంగా సాగింది. ఈ భారత్ సమ్మిట్లో 100కు పైగా దేశాల నుంచి 400 మందికి పైగా ప్రగతిశీల, సామాజిక, -ప్రజాస్వామ్య, సామ్యవాద, కార్మిక ఉద్యమాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సదస్సు చేసిన తీర్మానాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వివిధ దేశాల ప్రతినిధులతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేశారు. ప్రపంచ శాంతి, సమ న్యాయం, వాతావరణ మార్పులు, టెర్రరిజం వంటి అంశాలపై లోతైన చర్చలు ఈ సదస్సులో జరిగాయి. డొమినికా రిపబ్లిక్ వంటి అతి చిన్న దేశాల నుంచి వచ్చినవారు సైతం చర్చల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
భారీగా పెట్టుబడుల రాక
రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ, జాతీయ సదస్సులు నిరంతరం నిర్వహించడం, అదేవిధంగా పెట్టుబడులు ఆకర్షించటానికి సీఎం సింగపూర్, దావోస్, జపాన్ వంటి దేశాలకు వెళ్లి ప్రయత్నించడం ద్వారా ఈ ఏడాదిన్నరలోనే రాష్ట్రానికి సుమారు రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. లక్షకు పైగా యువతకు ఉద్యోగాలువచ్చాయి. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, సమాంతరంగా 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండటం, పరిశ్రమలకు కావాల్సిన నిరంతర విద్యుత్, నీటిని ప్రభుత్వం
అందిస్తున్నది.
వేగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు, రానున్న రీజనల్ రింగ్ రోడ్డు పూర్తిస్థాయి గ్రోత్ కారిడార్గా మారబోతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో పాటు, పరిశ్రమలకు కావాల్సిన భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. అందుకే తెలంగాణ జరూర్ ఆనా, జరూర్ ఇన్వెస్ట్ మెంట్ బీ కర్ నా (తెలంగాణను తప్పకుండా దర్శించండి, పెట్టుబడులు పెట్టండి) రాష్ట్ర ప్రభుత్వ కొత్త నినాదంగా నిలవబోతోంది.
సీఎం విజన్ సాకారమవుతున్న వేళ...
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజాప్రభుత్వం వయస్సు కేవలం ఏడాదిన్నరే. అయినా సీఎం వినూత్న ఆలోచనలు, సాహసోపేత నిర్ణయాలతో వయస్సుకు మించి రాణిస్తోంది. నాలుగు వందల ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న హైదరాబాద్కు ప్రపంచపటంలో గ్లోబల్ సిటీ ఇమేజ్ తెచ్చేందుకు కృషి చేస్తోంది.
ఏడాదిన్నరలో ప్రజాప్రభుత్వం వరుసగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులన్నీ విజయవంతమయ్యాయి. దీంతో ఇటు హైదరాబాద్ ఇమేజీతోపాటు తెలంగాణ రైజింగ్ నినాదం ప్రపంచ దేశాలకు సుపరిచితమైంది. అలాగే వివిధ విదేశీ పర్యటనల్లో సీఎం లేవనెత్తిన తెలంగాణ రైజింగ్ ట్రిలియన్ ఎకానమీ విజన్, చైనా ప్లస్ వన్ ప్రచారం క్రమంగా అంతటికీ విస్తరించింది.
- బొల్గం శ్రీనివాస్, సీఎం పీఆర్ఓ–