వరల్డ్‌‌ ఆర్చరీ పారా సిరీస్‌‌ మూడో అంచె పోటీల్లో.. శీతల్‌‌ కు డబుల్‌‌ మెడల్‌‌

వరల్డ్‌‌ ఆర్చరీ పారా సిరీస్‌‌ మూడో అంచె పోటీల్లో.. శీతల్‌‌ కు డబుల్‌‌ మెడల్‌‌

అహ్మదాబాద్‌‌: ఇండియా పారా ఆర్చర్‌‌ శీతల్‌‌ దేవి.. వరల్డ్‌‌ ఆర్చరీ పారా సిరీస్‌‌ మూడో అంచె పోటీల్లో స్వర్ణం, కాంస్య పతకాలు గెలుచుకుంది. బుధవారం జరిగిన విమెన్స్‌‌ పారా కాంపౌండ్‌‌ వ్యక్తిగత విభాగం షూటాఫ్‌‌లో శీతల్‌‌ 10–9తో ఐజాదా సెడాన్‌‌ (కజకిస్తాన్‌‌)పై గెలిచి గోల్డ్‌‌ మెడల్‌‌ను కైవసం చేసుకుంది. రెగ్యులర్‌‌ మ్యాచ్‌‌లో ఇద్దరు ఆర్చర్లు 144–144 స్కోరుతో సమంగా నిలిచారు. దాంతో షూటాఫ్‌‌ నిర్వహించారు. 

కాంపౌండ్‌‌ మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌ ప్లే ఆఫ్‌‌లో శీతల్‌‌–తోమన్‌‌ కుమార్‌‌ జోడీ 157–145తో సారా అల్‌‌ హమీద్‌‌–అబ్బాస్‌‌ కదీమ్‌‌ (ఇరాక్‌‌)పై గెలిచి బ్రాంజ్‌‌ను సొంతం చేసుకున్నారు. రికర్వ్‌‌ మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌ ఫైనల్లో హర్విందర్‌‌–భావన 6–0తో లియాంగ్‌‌ కియురాంగ్‌‌–జియా లే (చైనా)పై గెలిచి స్వర్ణం నెగ్గారు. విమెన్స్‌‌ రికర్వ్‌‌ ఈవెంట్‌‌లో భావన 6–0తో రాజశ్రీ రాథోడ్‌‌ను ఓడించి కాంస్యాన్ని సాధించింది. 

పారా కాంపౌండ్‌‌ విమెన్స్‌‌ వ్యక్తిగత ఈవెంట్‌‌లో సరితా 141–140తో వాంగ్‌‌ హుయిటింగ్‌‌ (చైనా)పై గెలిచి కాంస్యం దక్కించుకుంది. మెన్స్‌‌ పారా కాంపౌండ్‌‌ వ్యక్తిగత విభాగంలో తోమన్‌‌ కుమార్‌‌ 143–138తో అబ్బాస్‌‌ కదీమ్‌‌ (ఇరాక్‌‌)ను ఓడించి కాంస్యం నెగ్గాడు. ఓవరాల్‌‌గా ఆఖరి రోజు ఇండియా రెండు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలతో టోర్నీని ముగించింది.