శవపేటికలో మృత‌దేహాన్ని చూసి షాకైన కుటుంబ సభ్యులు

శవపేటికలో మృత‌దేహాన్ని చూసి షాకైన కుటుంబ సభ్యులు

జీవ‌నోపాధి కోసం కేర‌ళ‌కు చెందిన చాలామంది సౌదీ అరేబియాకు వెళుతుండడం అంద‌రికీ తెలిసిన విష‌యం. ఆ క్ర‌మంలోనే బ‌తుకుదెరువు కోసం సౌది వెళ్లిన ఓ కేర‌ళ‌ వ్య‌క్తి గుండెపోటుతో అక్క‌డ అక‌స్మిక మృతి చెందాడు. మ‌ర‌ణించిన అనంత‌రం అత‌ని మృత‌దేహాన్ని అక్క‌డి అధికారులు స్వ‌దేశానికి త‌ర‌లించారు. ఇర‌వై రోజుల తర్వాత ఆ మృతదేహం కుటుంబ సభ్యుల దగ్గరికి చేరుకుంది. అయితే మృత‌దేహం కోసం నిరీక్షించిన ఆ కుటుంబ స‌భ్యులు శ‌వ‌పేటిక తెర‌చిన అనంత‌రం అనుకోని ఘ‌ట‌న‌తో నివ్వెర‌పోయారు.

గ‌త నెల 28న సౌదీ అరేబియాలో గుండెపోటుతో మృతి చెందిన ర‌ఫీఖ్ అనే వ్య‌క్తి డెడ్‌బాడీ సొంతూరుకి చేరుకోవ‌ల‌సి ఉంది. అయితే ఎక్క‌డ ఏ పొర‌పాటు జ‌రిగిందో తెలియ‌దు కానీ అత‌ని గ్రామానికి చేరుకున్న శవ‌పేటిక‌లో అత‌ని మృత‌దేహానికి బ‌దులు మ‌రో మ‌హిళ శ‌వం ఉండ‌డంతో అత‌ని కుటుంబ స‌భ్యులు ఆశ్చ‌ర్యానికి గురి అయ్యారు. చివ‌రి చూపు చూద్దామ‌నుకున్న ఆ కుటుంబ స‌భ్యుల‌కు దిమ్మ తిరిగి పోయింది. ఈ ఘ‌ట‌న తిరువ‌నంత‌పురంలో చోటు చేసుకుంది.

ఈ షాకింగ్ ఘ‌ట‌న‌తో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. శ‌వ‌పేటిక‌ను త‌ర‌లించ‌డంలో ఏదో త‌ప్పిదం జ‌రిగి ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. శ‌వ‌పేటిక‌లో ఉన్న మృత‌దేహం శ్రీ‌లంకకు చెందిన మ‌హిళ‌గా వారు గుర్తించారు. ప్ర‌స్తుతం ఆ శ‌వాన్ని కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించామ‌ని, అనంత‌రం ఆ శవాన్ని తిరిగి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని వారు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అయితే అస‌లు వ్య‌క్తి మృత‌దేహం గురించి ఇంకా ఎలాంటి స‌మాచారం తెలియ‌క‌పోవ‌డంతో ఆ కుటుంబ స‌భ్యులు ఆందోళ‌నలో ఉన్నారు.