సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు రెండు జట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం నుంచి మొదలవ్వనున్న ఈ మ్యాచ్లో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమ్స్ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కంటే న్యూజిలాండ్కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. మ్యాచ్ ప్రాక్టీస్ విషయంలో కివీస్తో పోల్చుకుంటే టీమిండియా వెనుకబడిందని పీటర్సన్ అన్నాడు.
‘డబ్ల్యూటీసీ ఫైనల్కు న్యూజిలాండ్ అన్ని విధాలా సిద్ధమైంది. రీసెంట్గా ఇంగ్లండ్తో రెండు టెస్టులు ఆడటం కివీస్కు లాభించే అంశం. ఆ రెండు మ్యాచుల్లోనూ ఇంగ్లండ్పై న్యూజిలాండ్ ఆధిక్యం చూపడం వారిలో సానుకూలతను పెంచుతుంది. ఐపీఎల్ అర్థాంతరంగా ఆగిపోయాక సరైన వార్మప్ లేకపోవడం, మ్యాచ్ ప్రాక్టీస్ లేమి టీమిండియాకు ప్రతికూల అంశాలు. ఇంగ్లండ్పై కివీస్ బౌలర్లు చెలరేగిన తీరు బాగుంది. ముఖ్యంగా సీనియర్ పేసర్ టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీల బౌలింగ్ నన్ను ఆకట్టుకుంది. సన్నాహకాల విషయంలో భారత వెనుకంజలో ఉందనేదే నా భయం. రెండు మ్యాచ్లు ఆడినందున ఇక్కడి పరిస్థితులపై కివీస్కు అవగాహన ఏర్పడింది. కేన్ విలియమ్సన్, కైల్ జెమీసన్, టిమ్ సౌథీ లేకున్నా న్యూజిలాండ్ రెండో టెస్టులో గెలవడం శుభపరిణామం. అందుకే భారత్తో పోల్చితే ఆ జట్టుకు కాస్త ఎక్కువ అడ్వాంటేజ్ ఉందనే చెప్పాలి’ అని పీటర్సన్ పేర్కొన్నాడు.