ఆఫ్ లైన్ విస్తరణ క్రమంలో హైదరాబాద్, తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టు షియోమి ప్రకటించింది. అమ్మకాల్లో ఆఫ్ లైన్ మార్కెట్ వాటాను 50 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు షియోమి ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనూజ్ శర్మ తెలిపారు. షియోమి కొత్త స్మార్ట్ ఫోన్లు రెడ్ మి 7, రెడ్ మి వై3, ఎల్ ఈడీ స్మార్ట్బల్బ్ ను గురువారం మార్కె ట్లోకి విడుదల చేశారు. ఈ విడుదల సందర్భంగా రిటైల్ ఔట్ లెట్ల విస్తరణ ప్రణాళికను శర్మ వివరించారు. 2019 చివరి నాటికి పదివేలకు పైగా రిటైల్ అవుట్ లెట్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
ఇప్పటికే షియోమికి 6వేల రిటైల్ అవుట్ లెట్లున్నాయి. అంతేకాక ఎంఐ స్టూడియో పేరిట ఎక్స్ క్లూ జివ్ అవుట్లెట్లను షియోమి ప్రవేశపెడుతోంది. ఇప్పటికే ఎంఐ హోమ్స్ గా పెద్ద అవుట్లెట్లు ఉండగా.. చిన్న పట్టణాలకు, గ్రామాలకు తమ అవుట్లెట్లను విస్తరిస్తోంది. ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా వెయ్యి ఎంఐ స్టోర్ల ఏర్పాటుతో 2వేల మందికి పైగా ఉద్యోగావకాశాలను కల్పించినట్టు షియోమి ఇండియా ప్రకటించింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో షియోమి ఇండియా ఏడో సరికొత్త స్మార్ట్ఫోన్ తయారీ ప్లాంట్ను తమిళనాడులో పెట్టనుంది. ఇప్పటికే నాలుగు చోట్ల స్మార్ట్ఫోన్ ఉత్పత్తి ప్లాంట్లున్నాయి. 99 శాతం ఫోన్లు మేడ్ ఇన్ ఇండియావే. షియోమి తన స్మార్ట్ఫోన్ల ప్లాంట్ల ద్వారా 20 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.