కార్తీకంలో యాదాద్రికి కాసుల వర్షం

కార్తీకంలో యాదాద్రికి కాసుల వర్షం

యాదగిరిగుట్ట, వెలుగు: కార్తీకమాసంలో యాదాద్రి నరసింహుడి ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. 2020 కార్తీక మాసంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఈసారి ఏకంగా రూ.1.60 కోట్లకు పైగా అధికంగా వచ్చింది. నవంబర్ 4న మొదలైన కార్తీకమాసం డిసెంబర్ 4న ముగిసింది. ఈ 30 రోజులలో భక్తులు నిర్వహించిన  పూజల ద్వారా ఆలయానికి రూ.7 కోట్ల 35 లక్షల 10,307 ఇన్ కం వచ్చింది. అలాగే 2020 కార్తీక మాసంలో జరిగిన సత్యనారాయణస్వామి వ్రతాలతో పోల్చితే ఈసారి 3,416 వ్రతాలు ఎక్కువగా జరిగాయి. ఈ కార్తీక మాసంలో మొత్తం 19,204 మంది వ్రతాల్లో పాల్గొన్నారు. ఈసారి కేవలం సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారానే ఆలయానికి రూ.96.02 లక్షల  ఆదాయం సమకూరింది.

కిటకిటలాడిన యాదాద్రి

యాదాద్రి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామి ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట పట్టింది. యాదాద్రిలో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో కొండపైకి భక్తుల వెహికల్స్​ను అనుమతించలేదు. కొండ కింద పాతగోశాల, రింగు రోడ్డులో పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు. స్వామివారిని అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఆదివారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు జరిపించిన పలురకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.22 లక్షల 69,332 ఆదాయం వచ్చింది.