
- 12 మంది పదవుల కోసం కార్యకర్తలను మోసం చేస్తున్నరు
- బీజేపీ ఓటు బ్యాంకు పడిపోయింది
- బీఆర్ ఎస్ , బీజేపీ పొత్తు పెట్టుకుంటయ్
- కేసీఆర్ను గద్దె దింపేందుకు ఉద్యమకారులంతా ఏకం కావాలి
- ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని వెల్లడి
హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్ను గద్దె దింపాలంటే అన్ని పార్టీల్లో ఉన్న ఉద్యమ కారులంతా ఒకే వేదిక మీదికి రావాలని బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అర్ధరాత్రి జీవో ఇచ్చినట్లు బీజేపీ తనను అర్ధరాత్రి సస్పెండ్ చేసిందని, ఎందుకు సస్పెండ్ చేసిందో కారణాలు అడగనని ఆయన పేర్కొన్నారు. ‘‘కనీసం వివరణ కూడా అడగలేదు. 1996 నుంచి ఉద్యమంలో ఉన్న నేను నిఖార్సయిన ఉద్యమకారుడ్ని. నాకు సస్పెండ్ లు, కేసులు, అరెస్టులు కొత్త కాదు. సస్పెండ్ అనంతరం కాంగ్రెస్ నేతలు నాతో చర్చలు జరిపారు” అని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యెన్నం శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై బీజేపీ నేతలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమకారులు బీజేపీలో ఉండలేరని అన్నారు. ‘‘బీఆర్ ఎస్ తో కొట్లాడుతారనే బీజేపీలో ఉద్యమకారులు చేరారు. ఇదే విషయం బీజేపీలో జాయిన్ అయ్యే ముందు అమిత్ షాకు కూడా చెప్పారు. ఉద్యమకారులకు అన్యాయం చేస్తే మీకే నష్టం. మాజీ మంత్రి చంద్రశేఖర్ ను పార్టీలోకి తీసుకొచ్చాను. ఆయన పార్టీలోకి వచ్చే ముందు బీజేపీలో ఉండలేనని నాతో అన్నారు. 5 సార్లు గెలిచి మంత్రిగా చేసిన చంద్రశేఖర్కు ఇంత వరకు వార్డ్ మెంబర్ గా కూడా గెలవని వ్యక్తులు పాఠాలు చెప్పారు. బీజేపీలో పరిస్థితి ఇలా ఉంది” అని విమర్శించారు. నాడు పొత్తు వద్దని నేతలు చెప్పినా చంద్రబాబు దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టారని, కొన్ని సీట్ల కోసం లక్షల మంది బీజేపీ కార్యకర్తలను, అభిమానుల గొంతు కోశారని మండిపడ్డారు. 12 మంది పదవుల కోసం బీజేపీ కార్యకర్తల, అభిమానులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
లిక్కర్ స్కామ్పై ఎందుకు సైలెంట్ అయ్యిన్రు?
మునుగోడు బైపోల్, లిక్కర్ స్కామ్ నుంచి బీజేపీ, బీఆర్ ఎస్ కలిసిపోయినట్లు గ్రౌండ్ లెవల్ లో చర్చ జరుగుతున్నదని యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ‘‘వచ్చే రోజుల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవటం ఖాయం. రాష్ట్రంలో ఎంతో అవినీతి జరుగుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? కేంద్రంలో అధికారంలో ఉండి.. ఈడీ, సీబీఐ మీ చేతిలో ఉన్నా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసు బయటకు రాగానే మునుగోడు బైపోల్లో బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు. లేకపోతే రాజగోపాల్ రెడ్డి గెలిచే వారు. బైపోల్ అయిన 6 నెలల దాకా రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. మీరే (అమిత్ షా) రాజీనామా చేయాలని చెప్పి, మీరే పోటీ చేయాలని చెప్పి అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటం ఏమిటి?” అని మండిపడ్డారు.
లిక్కర్ స్కామ్ను బయటకు తీసి, మళ్లీ ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. తాను బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని, పార్టీకి వ్యతిరేకంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, పేరాల శేఖర్, రఘునందన్ రావు సహా అందరూ మాట్లాడారని, అయినా వాళ్లపై చర్చలు తీసుకోలేదని అన్నారు. ‘‘ఒవైసీతోనే తమ పోరాటం అని చేవెళ్ల మీటింగ్ లో అమిత్ షా చెప్పారు. ఒవైసీ బలం 8 సీట్లే. ఆయనతో పోరాడితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి ఎట్ల వస్తది?” అని యెన్నం ప్రశ్నించారు. అర్బన్ సీట్లలో కొన్ని ప్రాంతాల్లో తప్ప రూరల్ లో బీజేపీ గెలవదని, ఈ విషయం అధ్యక్షుడికి కూడా తెలుసని అన్నారు.
కొత్త ప్రెసిడెంట్ వచ్చాక మారుతుందనుకున్న..
‘‘బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీకి రాష్ట్రంలో 22 శాతం ఓటు బ్యాంక్ ఉండేది. కొత్త ప్రెసిడెంట్ వచ్చాక 35 శాతం అవుతుందని అందరూ అనుకున్నరు. కానీ, ఇప్పుడు బీజేపీ ఓట్ షేర్ 12 శాతం కు తగ్గింది” అని యెన్నం విమర్శించారు. ఉద్యమంలో పోరాడిన విద్యార్థులు, జర్నలిస్టులు, అమరవీరుల కుటుంబాలకు వచ్చే ప్రభుత్వం 250 గజాల స్థలం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.