యోగ భవిష్యత్‌‌పై భరోసాను కల్పిస్తుంది: స్వామి చిదానంద గిరి

యోగ భవిష్యత్‌‌పై భరోసాను కల్పిస్తుంది: స్వామి చిదానంద గిరి

న్యూఢిల్లీ, వెలుగు: మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కొల్పడంలో క్రియాయోగ సాధన అద్భుత పాత్ర పోషిస్తోందని యోగధా సత్సంగ్‌‌ సొసైటీ ఆఫ్‌‌ ఇండియా అధ్యక్షుడు స్వామి చిదానంద గిరి అన్నారు. కనుబొమ్మల మధ్య దృష్టి కేంద్రీకరించి శ్వాస మీద ధ్యాసను నిలుపుతూ, దైవత్వంతో తన్మయత్వాన్ని ఆస్వాదిస్తూ సాగే ఈ ప్రక్రియతో మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. ఆదివారం నోయిడాలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి స్వామి చిదానంద గిరి ప్రసంగించారు. ఒడిదొడుకుల జీవన గమనంలో తీవ్రమవుతున్న ఆందోళన, అసహనం వంటి రుగ్మతలను తొలగించే శక్తి క్రియాయోగకు ఉందన్నారు.

ప్రేమ, శాంతి, సహనం, సుహృద్భావం వంటి సాత్విక గుణాలను వృద్ధిచేయడంలో క్రియాయోగ పాత్ర విశిష్టమైందన్నారు. క్రియాయోగ సాధన ద్వారా అంతరంగ, ఆధ్యాత్మిక, లక్ష్యసిద్ధి సులువుగా సాధ్యమన్నారు. శరీరం, మెదడు, మనసును అనుసంధానించే క్రియాయోగతో అనేక సంక్లిష్టతలు, ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కోవడం సులువవుతుందన్నారు. భవిష్యత్‌‌పై భరోసాను కల్పించే క్రియాయోగ, ధ్యానం, గురువుల బోధనల పుస్తకాలు నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రొగ్రాంలో దేశ, విదేశాల నుంచి సొసైటీ సభ్యులు, ఆధ్యాత్మిక గురువులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.