యువకుడు మృతి.. ప్రేమ పేరుతో ఫ్రెండ్ అన్నకు వలేసిన బీటెక్ విద్యార్థిని

యువకుడు మృతి.. ప్రేమ పేరుతో ఫ్రెండ్ అన్నకు వలేసిన బీటెక్ విద్యార్థిని

వరంగల్: ప్రేమ పేరుతో ఘరానా మోసం చేసిన ఘటన వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలి సోదరుడికి ప్రేమపేరుతో ఓ బీటెక్ విద్యార్థిని వల వేసింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్మిపురానికి చెందిన ఓ యువతి బీటెక్ చదువుతోంది. డబ్బులు సంపాదించాలనే ఆశతో తన ఫ్రెండ్ అన్నకే వలేసింది.  రాయపర్తి మండలం మొరిపిరాలకు చెందిన తన స్నేహితురాలి అన్నకు ఫోన్ చేసింది. ముగ్గురు వేర్వేరు యువతుల పేర్లతో యువకుడికి ఫోన్ కాల్స్ చేస్తూ.. ముగ్గులోకి లాగింది. అనంతరం ఆ ముగ్గురిలో ఓ యువతి పురుగుల మందు తాగి చనిపోయిందని బెదిరించి డబ్బులు లాగేయత్నం చేసింది. దాంతో భయపడిన యువకుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కిలాడీ యువతిని అదుపులోకి తీసుకున్నారు.