టిక్ టాక్ మోజు.. అడవిలో తప్పిపోయాడు

టిక్ టాక్ మోజు.. అడవిలో తప్పిపోయాడు

తిరుపతి: టిక్ టాక్ మోజులో పడి ఓ విద్యార్ది అడవికెళ్లి వీడియోలు తీసి దారి తప్పి ఇరుక్కుపోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో జరిగింది.  కలకడ మండలానికి చెందిన మురళి అనే యువకుడు తిరుపతిలోని  విద్యానికేతన్ విద్యాసంస్థలలో  మైక్రోబయాలజీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. టిక్ టాక్ మోజులో పడ్డ మురళి వినూత్నంగా సెల్ఫీ వీడియోలు తీద్దామని శేషాచలం అడవుల బాట పట్టాడు.

వీడియోలు అయితే బాగానే తీసుకున్నాడు కానీ.. ఈ తర్వాత తాను వచ్చిన దారి మాత్రం మరచిపోయాడు.  తిరిగి వచ్చే దారి తెలియక ఆ అడవిలో మరో చోటుకు వెళ్లాడు. తాను దారి తప్పానని గ్రహించిన మురళి తన ఫ్రెండ్స్ కి లొకేషన్ షేర్ చేసి తానున్న పరిస్థితి గురించి తెలిపాడు. అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మురళిని రక్షించడానికి ఆదివారం అర్ధరాత్రంతా అడవిని జల్లెడ పట్టారు.  అతనికి ఫోన్ ఎలాంటి స్పందన లేకపోవడంతో గాలింపు చర్యలను తీవ్రం చేశారు. అయితే రాత్రంతా ఒంటరిగా ఉన్న మురళి భయానికి లోనై మూర్ఛకు గురైయ్యాడు . ఎట్టకేలకు మురళిని గుర్తించిన పోలీసులు వైద్యం కోసం రుయా ఆసుపత్రికి తరలించారు.