
అల్వాల్, వెలుగు: బాలికలను మాయమాటలతో లవ్ ట్రాప్లో దింపిన యువకులు ముగ్గురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులను అల్వాల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ ప్రశాంత్ తెలిపిన ప్రకారం..
అల్వాల్ లోని ఓ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు ఈ నెల 20న సికింద్రాబాద్ కు వెళ్లారు. అక్కడి నుంచి ఓయూ ప్రాంతానికి వెళ్లారు. అక్కడే రోడ్డుపై వెళ్తున్న మధు అనే యువకుడితో మాటలు కలిశాయి. సదరు యువకుడు తన స్నేహితులైన పెంట్రోల్ బంక్ లో పని చేసే నీరజ్, ఒక మాల్లో పనిచేసే నానిని అక్కడికి పిలిచి వారికి పరిచయం చేశాడు.
ముగ్గురు బాలికలకు ఈ ముగ్గురు యువకులు స్నేహితులుగా, ప్రేమికులుగా మారారు. ముగ్గురు యువకులు బాలికలను నమ్మించి యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. అక్కడ ఓ లాడ్జీ తీసుకుని వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి ముగ్గురు యువకులతో పాటు హోటల్ యజమానిని అరెస్ట్ చేశారు.