డెల్టా కంటే ఆరు రెట్ల వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్

డెల్టా కంటే ఆరు రెట్ల వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్

ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ రోజుల వ్యవధిలోనే దాదాపు 30 దేశాలకు విస్తరించింది. భారత్ లో రెండు కేసులు నమోదు కావడంతో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. ఈ వైరస్.. డెల్టా రకం కంటే ఆరు రెట్ల వేగంతో వ్యాపిస్తోందని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. 

నవంబర్ 24న తొలిసారి ఒమిక్రాన్ వేరియంట్ ను డబ్ల్యూహెచ్ వో గుర్తించింది. దక్షిణాఫ్రికా, బోట్స్ వానా దేశంలో తొలి కేసులు నమోదయ్యాయి. నవంబర్ 26న వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా డబ్ల్యూహెచ్ వో ప్రకటించింది. అదే రోజు మరో నాలుగు దేశాల్లో కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 1న అత్యధికంగా తొమ్మిది దేశాల్లో వైరస్ లక్షణాలు కనిపించాయి. నిన్న ఇండియాలోని కర్ణాటకలో రెండు కేసులు నమోదు కావడంతో  అధికారులు అలర్ట్ అయ్యారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కలిగే పరిణామాలను ఇప్పుడే ఊహించడం కష్టమని శాస్త్రవేత్తలు అంటున్నారు. యువతపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు. వైరస్ సోకిన కొన్ని రోజుల తర్వాత లక్షణాలు బయటపడుతుండటంతో వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని అంటున్నారు. 

అయితే ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు చర్యలు వేగవంతం చేశారు. వ్యాక్సినేషన్ బూస్టర్ డోస్ పై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే 40 శాతం మంది రెండు డోసులు తీసుకోగా.. 84 శాతం మంది ప్రజలు మొదటి డోసు తీసుకున్నారని కేంద్రం వెల్లడించింది. ప్రతి ఒక్కరు టీకా వేసుకుంటేనే కరోనాను ఎదుర్కోగలమని వైద్యులు అంటున్నారు. ఇటు కర్నాటక సర్కార్ కూడా అప్రమత్తమైంది. హెల్త్ ఎక్స్ పర్ట్స్ తో మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రాత్రి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాతో సమావేశమైన బొమ్మై .. ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.