ట్రాక్ పై యువ‌తి డెడ్‌బాడీ.. రేప్ చేసి చంపి ఉంటార‌ని అనుమానం

ట్రాక్ పై యువ‌తి డెడ్‌బాడీ.. రేప్ చేసి చంపి ఉంటార‌ని అనుమానం

అనుమానాస్ప‌ద స్థితిలో రైలు పట్టాలపై ఓ యువతి మృతదేహం లభ్యం కావడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది. బుధవారం ఉదయం గరిమెళ్లపాటు రైల్వే ట్రాక్‌పై యువతి డెడ్ బాడీ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆరా తీసిన టూ టౌన్ ఇన్స్‌పెక్టర్ బత్తుల సత్యనారాయణ.. మృతురాలు‌ కొత్తగూడెం పట్టణలోని గంగభిషన్ బస్తీకి చెందిన దేవిక‌గా గుర్తించారు.

పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. మంగళవారం అర్ధరాత్రి సమయంలో దేవిక‌ పొరుగు ఇంట్లో నివసించే సందీప్ అనే యవకుడు గోడ దూకి ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ఇది గమనించిన యువతి తల్లిదండ్రులు అత‌ణ్ని పట్టుకొని, అత‌ని త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కే తీసుకెళ్లి మందలించారు. తిరిగి వారు ఇంటికెళ్లేసరికి దేవిక ఇంట్లో కనిపించక‌పోవ‌డంతో ఆమె తండ్రి అశోక్ ప్ర‌సాద్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా బుధవారం ఉదయం రైల్వే ట్రాక్ మీద ఓ యువతి శవం కనిపించింద‌ని స్థానికులు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శ‌వాన్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. చ‌నిపోయిన‌ యువ‌తి తమ కుమార్తె దేవిక అని గుర్తించిన ఆమె త‌ల్లిదండ్రులు… ఆమె పై అత్యాచారం చేసి హత్య చేశారని, మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు.

దేవిక చ‌నిపోయిన‌ తర్వాత సందీప్, అతడి తల్లిదండ్రులు కనిపించకపోవడంతో పోలీసులు ప‌లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ట్రాక్‌పై పడి ఉన్న దేవిక మృతదేహంపై దుస్తులు సరిగా లేకపోవడంతో ఆమెను రేప్ చేసి మర్డర్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో ప‌లువురు ముఖ్యంగా యువ‌త‌ పోస్టులు చేస్తున్నారు. జ‌స్టీస్ ఫ‌ర్ దేవిక అంటూ ట్విట‌ర్‌లో మినిస్ట‌ర్ కేటీఆర్ కు ట్యాగ్ చేస్తున్నారు. టిక్‌టాక్, వాట్సాప్ స్టాట‌స్‌ల‌లో దేవిక మ‌ర్డ‌ర్ సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.