జవహర్ నగర్, వెలుగు: పాముకాటుతో జవహర్ నగర్లో ఓ యువతి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని భాగ్యనగర్ కాలనీలో అఖిల (17) అనే యువతి తల్లితో కలిసి ఇండ్లలో పనిచేస్తున్నది. వారి ఇంటి పరిసర ప్రాంతాల్లో కట్టెల కోసం చెట్ల పొదల్లోకి వెళ్లడంతో అఖిలను పాము కాటేసింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అఖిలను వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సర్కారు ఆసుపత్రిలో పాముకాటు విరుగుడు ఇంజక్షన్ లేదని చెప్పగా మీనాక్షి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సకాలంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతోనే తమ కూతురు మరణించిందని అఖిల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా లేకపోవడంతోనే తమ కూతురు చనిపోయిందన్నారు.