
యూట్యూబర్ హఫీజ్ సయ్యద్ కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన టాప్ 100 డిజిటల్ స్టార్స్ లో గోదావరిఖనికి చెందిన అతడికి చోటు లభించింది. తెలుగు టెక్ ట్యూట్స్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న సయ్యద్ హఫీజ్ ఫోర్బ్స్ 100 డిజిటల్ స్టార్స్ లో 32వ స్థానంలో నిలిచాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి యైటింక్లైన్ కాలనీకి చెందిన హఫీజ్ 2011లో 'తెలుగు టెక్ ట్యూట్స్' పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అప్పటి నుంచి సెల్ ఫోన్ వినియోగంతో పాటు వాటి ప్రత్యేకతలు, లాభనష్టాలు, కొత్త ఫోన్ల అన్ బాక్సింగ్, వివిధ రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గురించి వివరిస్తూ వీడియోలు చేస్తున్నాడు. ఈ వీడియోలతో అతడు ఎంతో పాపులర్ అయ్యాడు.
హఫీజ్ యూట్యూబ్ ఛానల్ కు 16 లక్షల సబ్ స్క్రైబర్లు ఉన్నారు. దీన్ని ద్వారా నెలకు రూ.2 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు. హఫీజ్ వీడియోలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని ఫోర్బ్స్ తన మ్యాగజైన్ లో పేర్కొంది. సింగరేణి కార్మికుడి కుటుంబం నుంచి వచ్చిన అతడు..ఉన్నత విద్య చదవకపోయినా తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ మీడియాలో దూసుకెళ్తున్నాడు. హఫీజ్ ఫోర్భ్స్ ఇండియా డిజిటల్ స్టార్స్ లో చోటు దక్కడంపై గోదావరిఖని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.