ముందస్తు ఎన్నికలు లేవు.. ఒక్క ఎమ్మెల్యేనూ వదులుకోను : సీఎం జగన్

ముందస్తు ఎన్నికలు లేవు.. ఒక్క ఎమ్మెల్యేనూ వదులుకోను : సీఎం జగన్

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని.. తెలంగాణ రాష్ట్రంతోపాటు నిర్వహించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్. ఏప్రిల్ 4వ తేదీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేలతో భేటీ జరిగింది. ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఉపదేశాన్ని వివరించారు మంత్రి జోగి రమేష్. 

ఏపీలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2024లోనే జరుగుతాయని వివరించారాయన. 60 మంది ఎమ్మెల్యేలను మార్చుతున్నట్లు వార్తలను సైతం జగన్ ఖండించారని.. అందరినీ గెలిపించుకునే బాధ్యత పార్టీపై ఉందన్నారాయన. ఒక్క ఎమ్మెల్యేను కూడా వదులుకోం.. అందర్నీ గెలిపించుకుంటాం అని స్పష్టంచేసినట్లు వివరించారాయన. 

నాలుగు ఎమ్మెల్సీల ఓటమిపై జగన్ స్పందిస్తూ.. వాపును చూసి బలుపు అని టీడీపీ భావిస్తుందని.. తప్పుడు వార్తలతో నిజాన్ని సమాధి చేయాలని చూస్తున్నారంటూ జగన్ వ్యాఖ్యానించారు. 

గడప గడపకు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని.. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్నట్లు వెల్లడించారాయన. 2024 ఎన్నికల్లో గెలిచే బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉందని.. గెలిచి తీరాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు జగన్. ప్రతి ఎమ్మెల్యే సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకోవాలని.. ఇంటింటికీ వెళ్లటంతోపాటు నిరంతరం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని హితబోధ చేశారు జగన్. ఎమ్మెల్యేల గ్రాఫ్ సరిగాలేకపోతే వ్యక్తిగతంగా మీతోపాటు.. పార్టీకి సైతం నష్టం అని.. ప్రతి ఎమ్మెల్యే కష్టపడి పని చేయాలని.. ఉన్న ఏడాది కాలాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు సీఎం జగన్.

ప్రజలకు మంచి చేస్తున్నా.. ఎల్లో మీడియా తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని సీఎం జగన్ ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ఇలాంటి రూమర్స్ ఇంకా ఎక్కువ జరుగుతాయని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు వాటికి భంగ పడకుండా ఉండాలని సూచించారు. కొందరు.. ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి వాళ్లపై విష ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో జరిగిందని ప్రజలను మభ్య పెడుతున్నారు. 21 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే 17 తమ పార్టీ గెలిచిందని జగన్ గుర్తుచేశారు.