YSRTP కూడా వస్తోంది : పాలేరు నుంచి విజయమ్మ, మిర్యాలగూడ నుంచి షర్మిల పోటీ

YSRTP కూడా వస్తోంది : పాలేరు నుంచి విజయమ్మ, మిర్యాలగూడ నుంచి షర్మిల పోటీ
  • 119 నియోజకవర్గాల్లో పోటీకి దరఖాస్తుల ఆహ్వానం
  • 30–40 సెగ్మెంట్లలో సత్తా చూపేలా ప్రణాళిక
  • మిర్యాలగూడ నుంచి విజయమ్మ, పాలేరు నుంచి షర్మిల
  • సికింద్రాబాద్ బరిలో నిలవనున్న బ్రదర్ అనిల్ 
  • ఆరుగురు సభ్యులతో మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు
  • ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ


 హైదరాబాద్: కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనానికి బ్రేక్ పడడంతో ఆ పార్టీ చీఫ్ షర్మిల కొత్త కార్యాచరణను తెరమీదకు తెచ్చారు. నాలుగు నెలల పాటు ప్రయత్నించినా సానుకూల వాతావరణం ఏర్పడకపోవడంతో అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్టు వైఎస్సార్టీపీ ప్రకటించింది. ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణను కూడా ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. కనీసం 30నుంచి నలభై సెగ్మెంట్లలో నాలుగైదు వేల ఓట్లు చీల్చి గెలుపోటములను తారుమారు చేసే ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఆమె ఎంట్రీని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కొందరు ఒప్పుకోలేదని ప్రచారం జరిగింది. దీంతో ఆమె నేరుగా ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకలతో సమావేశమయ్యారు.

తన ప్రతిపాదనలను వాళ్ల ముందుంచారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చర్చలు ఫలిస్తాయని భావించారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఏపీలోనే ఆమె సేవలు వినియోగించుకోవాలని భావించిందని ప్రచారం జరిగింది. తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రతిపాదన పెట్టినట్టు ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం సికింద్రాబాద్ నుంచి బరిలోకి దిగాలని, అక్కడ క్రిస్టియన్ సామాజిక వర్గం ఓట్లతో గెలుపు సాధ్యమని సూచించిందనే వాదన కూడా బలంగానే వినిపించింది. చర్చోపర్చల తర్వాత షర్మిల ఒంటరి పోరుకు రెడీ అయ్యారు. అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఇందుకోసం వైఎస్సార్టీపీ రాష్ట్ర కార్యవర్గం ఇవాళ లోటస్ పాండ్ లోని షర్మిల నివాసంలో భేటీ అయ్యింది. మ్యానిఫెస్టో రెడీ చేసేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీని సైతం ఏర్పాలు చేసింది. రెండో రోజుల్లో మేనిఫెస్టోను విడుదల చేసేందుకు వైఎస్సార్టీపీ రెడీ అవుతోంది. తన తల్లి వైఎస్ విజయమ్మను ఎన్నికల బరిలోకి దింపనున్నారు. విజయమ్మ మిర్యాలగూడ స్థానం నుంచి ఆమె పోటీ చేయనున్నారు.

సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి తన భర్త బ్రదర్ అనిల్ పోటీ చేయనున్నారు. క్రిస్టియన్ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం బాగా కలిసి వస్తుందని షర్మిల అంచనా వేస్తున్నారు. తాను పాలేరు నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. నియోజక వర్గాల వారీగా పలువురు అభ్యర్థుల పేర్లు ఖరారు చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. సూర్యాపేట నుంచి పిట్ట రాంరెడ్డి, సత్తుపల్లి నుంచి కవిత, బోధన్ నుంచి సత్యవతి, కల్వకుర్తి నుంచి అర్జున్ రెడ్డి, వనపర్తి నుంచి వెంకటేశ్వర రెడ్డి, నర్సంపేట నుంచి శాంతికుమార్, అదిలాబాద్ నుంచి బెజ్జంకి అనిల్, చేవెళ్ల నుంచి దయానంద్, గజ్వేల్ నుంచి రామలింగారెడ్డి, సిద్దిపేటలో నర్సింహారెడ్డి, సిరిసిల్లలో చొక్కాల రాము, కామారెడ్డి నుంచి నీలం రమేశ్, అంబర్ పేట నుంచి గట్టు రామచంద్రరావును ఎన్నికల బరిలో నిలిపేందుకు వైఎస్ఆర్టీపీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇవాళ్టి నుంచి 119 సెగ్మెంట్లలో ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది.

ALSO READ : పూజల్లో నిమ్మకాయలను ఎందుకు వాడతారో తెలుసా..