వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతిపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ జరిపించాలని వినతి పత్రం అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మేఘా కంపెనీతో కలిసి రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు. గత కొంతకాలంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.
అయితే భవిష్యత్తులో జగన్ మీకు సపోర్ట్ ఇచ్చే అవకాశముందా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ప్రెస్ మీట్ లో షర్మిల ఆసక్తికర సమాధానం చెప్పారు. ‘నేను తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది రాష్ట్రంలో మార్పు తేవడం కోసం. నా గురించి నేను గొప్పలు చెప్పకుంటే బాగోదు. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది.నేను చేయాలనుకుంది..చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశా. నేను చేశాను కదా? అందరూ నాకు చేయాలనుకోవడం కూడా స్వార్థం అవుతుంది’ అని షర్మిల అన్నారు.