రాష్ట్రాన్ని ఏలేందుకు చేత కాలేదు గానీ దేశాన్ని ఏల్తడా?

రాష్ట్రాన్ని ఏలేందుకు చేత కాలేదు గానీ దేశాన్ని ఏల్తడా?
  • రాష్ట్రాన్ని ఏలడం చేతకాలే.. దేశాన్ని ఏల్తడా?
  • కేసీఆర్ పై షర్మిల ఫైర్ 

సంగారెడ్డి, వెలుగు: సీఎం కేసీఆర్​కు రాష్ట్రాన్ని ఏలేందుకు చేత కాలేదు గానీ దేశాన్ని ఏల్తడా? అని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. ‘‘ఈ దరిద్రం ఇక్కడితో చాలదన్నట్లు దేశాలు ఏలబోతాడట. ఆయన్ని ఎవడు అడిగాడు దేశాన్ని ఏలమని. అమ్మకి అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకి బంగారు గాజులు చేపిచ్చినట్టు ఉంది కేసీఆర్ తీరు” అని ఫైర్ అయ్యారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర చేశారు. జోగిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

‘‘బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చినందుకు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి పోతారా? ఇన్నేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్.. ఇప్పుడు దేశాన్ని దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. మిషన్ భగీరథ ఒక బోగస్ ప్రాజెక్టు అని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో వాడిన పైపులు, ట్యాంకులన్నీ పాతవేనని.. వాటి కలర్ మార్చి కొత్త వాటిగా చూపారని మండిపడ్డారు. రూ.40 వేల కోట్ల ప్రాజెక్టులో పెద్ద మొత్తంలో కమీషన్లు తిన్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫేవరేట్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డితో కలిసి కమీషన్లు తిన్నందుకు అవార్డు తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు.