బిల్లులు రాక పుస్తెలమ్ముకొని అప్పులు కడ్తున్రు : వైఎస్ షర్మిల

బిల్లులు రాక పుస్తెలమ్ముకొని అప్పులు కడ్తున్రు : వైఎస్ షర్మిల

కేంద్ర నిధులను మళ్లిస్తూ సర్పంచులను అరిగోస పెడుతున్న కేసీఆర్ సర్కారుపై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. 'అమ్మ పెట్టదు, అడుక్కుతిననివ్వదు' అన్నట్లు కల్వకుంట్ల కమీషన్ రావు తీరు ఉందని విమర్శించారు. సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోగా కేంద్రం నిధులను మళ్లించడంపై షర్మిల స్పందించారు. పంచాయితీలకు ఎలాగో నిధులివ్వని రాష్ట్రం, కేంద్రం నుంచి వచ్చే వాటిని కూడా దక్కనివ్వడం లేదని విమర్శించారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలంటారు కానీ రాష్ట్రంలో ఆ కొమ్మలకే ఊరేసుకుని సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో సర్పంచులు అప్పులు తెచ్చి, పనులు చేయిస్తేనే గ్రామ పంచాయతీలకు అవార్డులు వస్తున్నాయని చెప్పారు. రివార్డులు తీసుకుంటున్న కేసీఆర్ దొర.. సర్పంచులకు బిల్లులు మాత్రం చెల్లించడం లేదని షర్మిల ఆరోపించారు.

సీఎం కేసీఆర్ ఒక్కో సర్పంచ్ కి రూ. 5 లక్షల నుంచి 30 లక్షల వరకు ఎగనామం పెట్టారని షర్మిల ఆరోపించారు. కార్మికుల జీతాలు చెల్లించలేక, పంచాయితీ ఆఫీసుల కరెంటు బిల్లు కట్టలేక, ట్రాక్టర్ల ఈఎంఐలు.. డీజిల్ ఖర్చులు భరించలేక మహిళా సర్పంచులు మెడలో తాళి బొట్లు అమ్మి అప్పులు కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు సర్పంచులు కూలి పనులకు వెళ్లి, మిత్తీలు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పెండింగ్ బకాయిలు రాక, మళ్లీ అప్పులు పుట్టక ఇప్పటికే 11 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ స్పందించలేదని షర్మిల ఫైర్ అయ్యారు. కేంద్రం ఇచ్చే నిధులు దొంగచాటున దోచేస్తున్న కేసీఆర్ కు.. ఆసిఫాబాద్ జిల్లాలో 18 మంది సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామా చేసి చెంప చెళ్లుమనిపించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చైతన్యం రావాలని.. సర్పంచులకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అండగా ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారు