కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ హస్తం : వైఎస్ షర్మిల 

కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ హస్తం : వైఎస్ షర్మిల 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాగ్ కు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిందే తప్ప ఆయకట్టు పెరగలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిలో కేసీఆర్ హస్తం ఉందన్న ఆమె.. రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని విమర్శించారు. కాళేశ్వరం అన్ని ప్యాకేజీల్లో అవినీతి జరిగిందని దీనిపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్కి అన్ని ఆధారాలు సమర్పించినట్లు చెప్పారు. ఇరిగేషన్, ఐఐటీ నిపుణులతో కలిపి స్వతంత్ర దర్యాప్తు జరుపుతామని కాగ్ హామీ ఇచ్చారని అన్నారు. 

మేఘా కంపెనీ చేపట్టే ప్రతి ప్రాజెక్టులో అవినీతి జరుగుతుందని షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇప్పటికే సీబీఐకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని షర్మిల అభిప్రాయపడ్డారు.

మునుగోడు ఉప ఎన్నికను ప్రజలు బహిష్కరించాలని షర్మిల పిలుపునిచ్చారు. ఇది వచ్చిన ఎలక్షన్ కాదు, తెచ్చుకున్న ఎన్నిక అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి మునుగోడు బైపోల్ తీసుకొచ్చారని షర్మిల మండిపడ్డారు. వివేకా హత్య కేసు దర్యాప్తుపైనా షర్మిల స్పందించారు. సుప్రీంకోర్టు ఆ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. సీబీఐ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయన్న షర్మిల.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.