- రాజకీయ లబ్ధి కోసం పోలవరం పై విమర్శలు
- సంజయ్, రేవంత్ కూ మేఘా నుంచి వాటాలు
- వచ్చే నెల 3 లేదా 4 నుంచి పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తా
హైదరాబాద్, వెలుగు: “వరదలొచ్చి రైతులు నష్టపోయారు. చాలా మంది ఇండ్లు కోల్పోయారు. ప్రభుత్వం వాళ్లకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. సాయం చేయకుండా ఓటీటీలో సినిమాలు చూస్తారట. ఓటీటీలో సినిమాల కోసం సలహా అడిగితే మేం వెటకారంగా ట్వీట్ చేశామని చిన్న దొరకు కోపం వచ్చింది. మాపై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారు. దమ్ముంటే సబ్జెక్టుపై మాట్లాడాలి. అధికారం చేతుల్లో ఉందని ఇంట్లో కూర్చుని షోలు, సినిమాలు చూస్తారా?” అని టీఆర్ఎస్సర్కారుపై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. సోమవారం లోటస్పాండ్లో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో బాధితులను పరామర్శించిన వివరాలను ఆమె వెల్లడించారు. భద్రాచలానికి కరకట్ట నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, కరకట్ట ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ‘‘సీఎం అయిన కొత్తలో రూ.105 కోట్లతో భద్రాచలాన్ని టెంపుల్ టౌన్గా మారుస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ విషయం పక్కనబెట్టి యాదాద్రిలో తనకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నారు. వరదలకు పోలవరం కారణమైతే ముందు ఎందుకు మాట్లాడలేదు. మీరు (కేసీఆర్, జగన్) స్నేహితులై ఉండి సమస్యను ఎందుకు పరిష్కరించలేదు? వరద బాధితులకు ఇన్ని రోజులు గడిచినా ఎందుకు సాయం ఇవ్వలేదు? వరదలతో నష్టపోయిన రైతులందరికీ రూ.లక్ష పరిహారం చెల్లించాలి. మళ్లీ పంట వేసుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. రూ.10 వేల సాయం సరిపోదు. ప్రతి కుటుంబానికి కనీసం రూ.25 వేలు ఇవ్వాలి” అని షర్మిల డిమాండ్ చేశారు. కాగా తన పాదయాత్రను ఈ నెల 27 నుంచి తిరిగి మొదలు పెడదామనుకున్నామని, వరదలు రావడంతో వాయిదా వేశామన్నారు. వచ్చే నెల 3 లేదా 4వ తేదీ నుంచి మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తామని షర్మిల తెలిపారు.
కాళేశ్వరం గురించి అందరికీ తెలుసు
వరదల సమయంలో కాళేశ్వరంలో ఏం జరిగిందో ప్రజలంతా చూశారని, ప్రభుత్వం ఎంత దాచాలనుకున్నా కాళేశ్వరంలో ఎంత నష్టం జరిగిందో సామాన్యులందరికీ తెలుసని షర్మిల అన్నారు. ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వకపోగా కాళేశ్వరం కట్టిన పాపానికి వేల ఎకరాల పంటలు మునిగిపోయాయని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఏం సాధించారని, సీఎం కేసీఆర్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ఆమె నిలదీశారు. కాళేశ్వరం పనులు 80 శాతం మేఘా కృష్ణారెడ్డికే ఎందుకు అప్పజెప్పారని, నాణ్యత లేని పనులు చేసినందుకు కృష్ణారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ‘‘ఉద్యమ సమయంలో ఆంధ్రా వాళ్లు ప్రాజెక్టులు తీసుకుంటున్నారన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఇంకా వాళ్లకే ప్రాజెక్టులు కట్టబెడ్తున్నారు? తెలంగాణలో ప్రాజెక్టులు చేసే వారు లేరా? కొత్త వాళ్లను ప్రోత్స హించరా? తెలంగాణ తెచ్చింది కృష్ణారెడ్డి కోసమేనా? రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు దీని గురించి మాట్లాడరు? రేవంత్, సంజయ్కు కూడా కృష్ణారెడ్డి దోస్తు. ఎవరికి ఇవ్వాల్సిన వాటా వాళ్లకు ఇస్తున్నారు. కృష్ణా రెడ్డి, ఆయన సంస్థపై సీబీఐ విచారణ జరిపించాలి” అని షర్మిల అన్నారు.
డీఎస్ ను పరామర్శించిన షర్మిల
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎంపీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ ను వైఎస్ షర్మిల పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇరువురి మధ్య రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వైఎస్ ఆర్ తో తన పాత అనుభవాలను ఈ సందర్భంగా డీఎస్ గుర్తు చేసుకున్నారు. షర్మిల ఐరన్ లేడీ అని, తప్పకుండా సీఎం అవుతారని డీఎస్ అన్నట్లు సమాచారం.