సీఎం‌‌‌‌ కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై షర్మిల మండిపాటు

సీఎం‌‌‌‌ కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై షర్మిల మండిపాటు

బంగారు తెలంగాణలో బంగారం మాయం చేసిండని ఫైర్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: సీఎంకేసీఆర్ జనాలకు గాల్లో మేడలు కట్టి.. తన కుటుంబానికి మాత్రం ఫామ్ హౌస్‌‌‌‌లు కట్టుకున్నారని వైఎస్సార్‌‌‌‌‌‌‌‌టీపీ చీఫ్‌‌‌‌ షర్మిల అన్నారు. ఆయన పాలనతో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ధనం మాయమైందని, బంగారు తెలంగాణలో బంగారం మాయమైందని దుయ్యబట్టారు. ఫాం హౌస్ పాలనకు ప్రజలు మూల్యం చెల్లించాలా? అంటూ కరెంట్ బిల్లుల భారాన్ని ప్రజలపై మోపే ప్రయత్నాలపై షర్మిల ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. సర్కార్ చెల్లించాల్సిన బకాయిలకు జనాన్ని బలి చేస్తారా? ప్రశ్నించారు.

ప్రభుత్వ శాఖల కరెంటు బిల్లు బకాయిలు 2014లో రూ.1,302 కోట్లు ఉంటే, 2022 నాటికి రూ.20,841 కోట్లకు పెరిగాయన్నారు. ఇది ఎవరి తప్పని, బకాయిలు ఎందుకు పేరుకుపోయాయని ప్రశ్నించారు. ఇందులో రూ.17 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఓటు వేసిన పాపానికి ప్రజల నెత్తిన భారం వేస్తారా అని నిలదీశారు. ‘‘విద్యుత్ లైన్ల లోపాలకు, కరెంట్ కొనుగోళ్ల అవకతవకలకు, డిస్కంల తప్పిదాలకు సర్కార్ చెల్లించాల్సిన బకాయిలకు.. జనాన్ని బలి చేస్తారా? ప్రజల నడ్డి విరిచి బిల్లులు రాబడతారా?’’అంటూ ప్రశ్నించారు.

కాళేశ్వరం పేరుతో ఎత్తిపోసిన నీళ్లను సముద్రంలో పోసి, రూ.9 వేల కోట్ల కరెంట్ బిల్లులను ఇప్పుడు జనం నెత్తిన మోపుతున్నారని దుయ్యబట్టారు. కాసుల కక్కుర్తి కోసం ఎత్తిపోతల పేరుతో ఎత్తేసిన సొమ్ము ఒక పక్క, వాటి నిర్వహణ భారం తలకు మించడం ఇంకోపక్క, మీ మోసం బద్ధలైందన్నారు. 2014లో ఇరిగేషన్ శాఖ విద్యుత్ బకాయిలు రూ.107 కోట్లు ఉంటే, 2020 నాటికి రూ.9,268 కోట్లకు పెరిగాయన్నారు. కేసీఆర్ ధన దాహం తెలంగాణ ప్రజలకు శాపమైందన్నారు.