హెచ్ఎండీఏలో జోనల్ కమిషనర్ల వ్యవస్థ.. త్వరలోనే రీఆర్గనైజేషన్

హెచ్ఎండీఏలో జోనల్ కమిషనర్ల వ్యవస్థ.. త్వరలోనే రీఆర్గనైజేషన్
  • జోనల్​ ఆఫీసుల్లో కమిషనర్లు, చీఫ్ ​ప్లానింగ్​ ఆఫీసర్లు 
  • అధికారాల వికేంద్రీకరణ ద్వారా  ప్రజలకు సేవలు  
  • ప్లానింగ్​ జోన్లను అడ్మినిస్ట్రేషన్ జోన్లుగా మార్చాలని నిర్ణయం
  • ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికి తప్పనున్న ఇబ్బందులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా హెచ్ఎండీఏలో అధికారాల వికేంద్రీకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం త్వరలోనే సంస్థలోని ఆయా విభాగాలను రీఆర్గనైజేషన్ ​చేయనున్నది. హెచ్ఎండీఏ పరిధి7,257 చదరపు కి.మీలు ఉండగా, కొత్తగా పెరిగిన విస్తీర్ణం ప్రకారం 10,472 చ.కి.మీటర్లకు చేరింది. అలాగే ఇప్పటి వరకూ ఏడు జిల్లాలుండగా, మరో మూడు జిల్లాలు వచ్చి చేరాయి. 

మండలాల సంఖ్య104 ఉండగా, 1355 గ్రామాలున్నాయి. ఇంత భారీ స్థాయిలో విస్తరించిన హెచ్ఎండీఏలో ఏదైనా పని ఉంటే ఇతర జిల్లాల వారు హైదరాబాద్​కు రావాల్సి వస్తోంది. అలా వచ్చినా పని పూర్తికాకపోతే రెండుమూడు రోజులు సిటీలోనే ఉండాల్సి వస్తోంది. భారీ నిర్మాణాలు, లేఅవుట్ల పర్మిషన్లు, భూమార్పిడి తదితర పనుల కోసం నేరుగా హెడ్డాఫీసుకే రావాల్సిన పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. 

ఆరు జోన్లలో అప్లై చేసుకున్నా..

హెచ్ఎండీఏను ఆరు జోన్లుగా విస్తరించారు. ఇందులో శంషాబాద్, శంకర్​పల్లి, శంకర్​పల్లి–1, మేడ్చల్​, మేడ్చల్​–1, ఘట్​కేసర్​ జోన్లు ఉన్నాయి. రియల్​ఎస్టేట్​వ్యాపారులు, భవన నిర్మాణదారులు ఇలా వివిధ రకాల పర్మిషన్ల కోసం ఆయా జోనల్ ఆఫీసుల పరిధిలో దరఖాస్తులు చేసుకున్నా ఆ పనులు ఎంత వరకు వచ్చాయో తెలుసుకోవడానికి హైదరాబాద్ ​హెడ్డాఫీసుకే వస్తున్నారు. మెట్రోపాలిటన్​ కమిషనర్​ పాటు, ఆయా జోనల్ ప్లానింగ్​ డైరెక్టర్లు, ప్లానింగ్​అధికారులు, మాస్టర్​ప్లాన్​విభాగం, ఇంజినీరింగ్​విభాగం ఇలా అన్ని విభాగాలకు సంబంధించి అధికారులంతా ప్రధాన కార్యాలయంలోనే ఉంటారు. 

జోన్​ ఆఫీసులు ఉన్నా అధికారులంతా హైదరాబాద్ లోనే ఉండడంతో ఆయా పనులు ఆలస్యం అవుతున్నాయన్న వాదనలున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న నగర విస్తరణతో పాటు, భారీ సంఖ్యలో వస్తున్న నిర్మాణాలను దృష్టిలో ఉంచుకుని హెచ్ఎండీఏలో అధికారులను వికేంద్రీకరించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. 

అడ్మినిస్ట్రేషన్​ జోన్ల ఏర్పాటు  

ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఆరు ప్లానింగ్​జోన్లను అడ్మినిస్ట్రేషన్​ జోన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా జోన్ల పరిధిలోని నిర్మాణాలకు, ల్యాండ్​యూజ్​, లే అవుట్​పర్మిషన్లను జోనల్ ​డైరెక్టర్లే ఇస్తున్నారు. త్వరలో ఈ ఆరు జోన్లను నాలుగు జోనల్​ఆఫీసులుగా మార్చాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ముందుగా శంషాబాద్, శంకర్​పల్లి జోన్లను నానక్​రామ్​గూడలోనూ, ఘట్​కేసర్​, మేడ్చల్​ జోన్లను తార్నాకలో ఉన్న ఆఫీసులోను ఏర్పాటు చేసి వాటిని అడ్మినిస్ట్రేషన్​ జోన్లుగా పిలవనున్నట్టు తెలుస్తోంది. 

వీటితో పాటు మరో రెండు జోనల్​ఆఫీసులు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఇప్పటివరకు వీటిని ప్లానింగ్​జోన్లు అని పిలుస్తున్నారు. ఇక మీదట జోనల్​ఆఫీసులని పిలుస్తారు. మొత్తం హెచ్ఎండీఏ పరిధిని 2500 చ.కి.మీ. చొప్పున విభజించి జోనల్​ఆఫీసులు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.  

బల్దియా మాదిరిగానే..

ఆయా జోన్లలో ఇక జోనల్​ కమిషనర్లు, చీఫ్​ప్లానింగ్​ ఆఫీసర్లు ఉంటారు. వీరి ఆధ్వర్యంలోనే అన్ని రకాల అనుమతులు, కొత్త ప్రాజెక్టులను చేపట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సమాచారం. దాదాపు బల్దియా మాదిరిగానే హెచ్ఎండీఏలో కూడా జోనల్​కమిషనర్లు నియమితులు కానున్నారు. 

అలాగే, ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎస్టేట్, అర్బన్​ఫారెస్ట్రీ​ వంటి అన్ని విభాగాలు కూడా జోనల్​ఆఫీసుల్లోనే ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల ఏఏ ప్రాంతాలకు చెందిన వారు ఆయా జోన్ల ఆఫీసులకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీని వల్ల హెడ్డాఫీసుకు వచ్చే అవసరం ఉండదంటున్నారు. అన్ని వ్యవస్థలను పర్యవేక్షించేందుకు హెడ్డాఫీసులో మెట్రోపాలిటన్​ కమిషనర్​ ఉంటారు.