Movie Review: ఓటీటీలో అలరిస్తున్న రెండు కొత్త సినిమాలు.. లవ్, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటున్న కథలు

Movie Review: ఓటీటీలో అలరిస్తున్న రెండు కొత్త సినిమాలు.. లవ్, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటున్న కథలు

2026 జూన్ తొలి వారంలో రెండు కొత్త తమిళ సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. థియేటర్లలో మంచి టాక్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాలు ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలు విభిన్న కథలతో వచ్చి అలరిస్తున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి కథ ఏమిటి? అనేది తెలుసుకుందాం.

లోకేష్ కనగరాజ్ ‘29’ :

తమిళంలో విడుదలైన యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ‘29’. స్టార్ డైరెక్టర్స్ లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 5 నుంచి నెట్​ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. దర్శకుడు రత్న కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో విధు, ప్రీతి అస్రానీ, మహేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘29’ ఏండ్ల యువకుడి ప్రేమకథతో వచ్చిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంది. 

కథేంటంటే:

సత్య (విధు) చిన్నప్పటి నుంచీ ముక్కుసూటి మనిషి. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకలా నటించడం అతనికి నచ్చదు. తనకు నచ్చినట్టుగా జీవించాలనే ఉద్దేశంతో సొంతూరు సేలం వదిలి చెన్నైకి వెళ్తాడు. అక్కడ స్నేహితులతో కలిసి ఒక గదిలో ఉంటూ ఉద్యోగం చేస్తుంటాడు. ఉద్యోగంపై పెద్దగా సంతృప్తి లేకపోయినా, జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. 29 ఏళ్లు వచ్చినా తనకంటూ ఓ ప్రేమకథ లేకపోవడం సత్యను తరచూ బాధపెడుతుంటుంది.

అలాంటి సమయంలోనే అతనికి విజయలక్ష్మి (ప్రీతి అస్రాని) పరిచయం అవుతుంది. ఆమె తల్లి ఆశించినట్టుగా బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉంటుంది. జీవితంలో ఏదైనా పెద్ద లక్ష్యం లేకుండా గడుపుతున్న సత్య తీరు ఆమెకు నచ్చదు. ఒకవైపు ప్రేమ పేరుతో తన వెంటపడుతున్న సత్య, మరోవైపు చదువుపైనే దృష్టి పెట్టమని చెప్తోన్న తల్లి.. ఈ రెండింటి మధ్య విజయలక్ష్మి ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనేదే మిగతా కథ.

‘కార్మేని సెల్వం’ OTT:

వర్సటైల్ యాక్టర్స్ సముద్రఖని-గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ ‘కార్మేని సెల్వం’. రామ్ చక్రి తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లక్ష్మి ప్రియా, అభినయ కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో భావోద్వేగాలకు పెద్దపీట వేసిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, కమర్షియల్‌గా మాత్రం యావరేజ్ ఫలితాన్నే సాధించింది.

ఇపుడు ఈ మూవీ జూన్ 3 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. కలలు నెరవేర్చుకోవడం కోసం చేసే అప్పులు, ఎలాంటి తిప్పలు పడేలా చేశాయి? అనేది కళ్ళకు కట్టినట్లుగా చూపించారు డైరెక్టర్. మధ్యతరగతి జీవితాల్లో డబ్బు ఆడించే ఆట ఎలా ఉంటుంది.. నిజాయతీగా బతికే వ్యక్తి మాయా ప్రపంచపు మత్తులో పడి ఎలా అప్పులపాలయ్యాడు? అనేది ఆలోచింపజేస్తుంది 

కథేంటంటే:

చెన్నై సముద్ర తీరంలోని ఓ మురికివాడలో సెల్వమ్ (సముద్రఖని) తన భార్య శాంతి (లక్ష్మీ ప్రియ), కొడుకు బాలుతో కలిసి నివస్తుంటాడు. ఇడ్లీ బండి నడిపే శాంతి, తమకు సొంత కారు ఉండాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కంటారు. ఆ కలలను నిజం చేసేందుకు డబ్బు కూడబెడుతుంటుంది. కానీ కుటుంబ అవసరాలు, బాధ్యతల కోసం ఆ డబ్బంతా ఖర్చు అయిపోతుంది. అయితే, రిచ్​గా బతికితేనే ధనవంతులు అవుతామనే ఆలోచన సెల్వమ్‌ను ప్రభావితం చేస్తుంది. యజమాని విదేశాలకు వెళ్లిన సమయంలో అతని కారును ట్యాక్సీగా నడుపుతూ సంపాదిస్తుంటాడు.

►ALSO READ | Irumudi: రవితేజ ‘ఇరుముడి’కి డేట్ ఫిక్స్..

అదే టైంలో స్థలం కొనడం, క్రెడిట్ కార్డులతో ఖర్చులు చేయడం, అప్పులు తీసుకోవడం మొదలుపెడతాడు. భార్య హెచ్చరించినా వినకుండా అప్పుల మీద అప్పులు చేస్తూ చివరకు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు. ఆ అప్పుల భారం నుంచి బయటపడటానికి సెల్వమ్ ఏం చేశాడు? అతని కుటుంబం ఎలాంటి కష్టాలను ఎదుర్కొంది? చివరకు వారి కలలు నెరవేరాయా లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.