- రూ.29.10 కోట్లతో విలేజ్ మహిళా సంఘ భవనాల నిర్మాణం
- ఫస్ట్ ఫేజ్ కింద 11 మండలాల్లో గోదాంల నిర్మాణం
- ఫుడ్ గ్రేయిన్స్ స్టోరేజీ సమస్య తీర్చడానికి నరేగా ఫండ్స్
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ సిటీలో మహిళా సంఘాల కోసం రూ.2 కోట్లతో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడ్తున్నాయి. అదే రీతిలో జిల్లాలోని మండల కేంద్రాల్లో గోదాంల నిర్మాణాల ప్రతిపాదనలు ఫైనల్ స్టేజ్కు చేరాయి. ఫస్ట్ ఫేజ్ కింద 11 మండలాల్లో ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఫైల్పై కలెక్టర్ సంతకం ముగియగానే పనులు మొదలుకానున్నాయి. 500 టన్నుల కెపాసిటీతో వీటిని నిర్మించడానికి రూ.15 లక్షల చొప్పున ఉపాధి హామీ నిధులను వినియోగించనున్నారు. రైతులు పంటలు, ఇతర ఆహార పదార్థాలు నిల్వ చేసుకోడానికి, మహిళా సంఘాల ట్రైనింగ్కు ఉపయోగపడేలా వీటిని నిర్మించనున్నారు.
ఏప్రిల్కు ముందే పనులు స్టార్ట్ మొదలయ్యేలా ప్లాన్ చేశారు. సెకండ్ ఫేజ్లో మిగిలిన మండలాలు తర్వాత దశలో గ్రామాల వారీగా గోదాంలు నిర్మించే ప్రణాళిక రూపొందించారు. 291 విలేజ్ల్లో రూ.10 లక్షలతో మహిళా సంఘాల (వీఓ) ఆఫీస్లను నిర్మించనున్నారు. ఇందుకు రూ.29.10 కోట్లు మంజూరు కాగా మరో 150 గ్రామాల్లో వీటిని మంజూరు చేయడానికి ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయి.
పంట దిగుబడుల నిల్వ సమస్య తీర్చడానికి..
కాంగ్రెస్ సర్కార్ వచ్చాక జిల్లాలో పంటల సాగు మరో 50 వేల ఎకరాలకు పెరిగి మొత్తం విస్తీర్ణం 5.22 లక్షల ఎకరాలకు చేరింది. సన్నాలకు బోనస్ లభించడంతో రైతులు వరి 4.31 ఎకరాల్లో పండిస్తున్నారు. వడ్ల దిగుబడి అంచనాలు 13 లక్షల టన్నులకు చేరాయి. దీంతో అన్ని చోట్లా గోదాంల సమస్య నెలకొంది. దీనిని అధిగమించేందుకు స్టేట్ గవర్నమెంట్ వినూత్న ఆలోచన చేసింది. రూ.15 లక్షల ఖర్చుతో 500 టన్నుల కెపాసిటీ గోదాంలను ముప్కాల్, నందిపేట, నవీపేట, నిజామాబాద్ రూరల్, రెంజల్, రుద్రూర్, సిరికొండ, వర్ని, వేల్పూర్, మొపాల్, బాల్కొండలో నిర్మించడానికి సర్కార్ ల్యాండ్ గుర్తించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒకే చెప్పడంతో పనులు స్పీడ్గా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ గోదాంల బాధ్యతలు నిర్వహించే మహిళా సంఘాలు అద్దె వసూలు చేస్తాయి.
విలేజ్ సమాఖ్యకు ఆఫీస్
స్వయం సహాయ సంఘాలకు కాంగ్రెస్ సర్కార్ రూ.10 లక్షలతో ప్రతీ విలేజ్లో వీవో ఆఫీస్ నిర్మించనుంది. జిల్లాలో మొత్తం 545 గ్రామాలుండగా 291 ఆఫీస్లకు నిధులు శాంక్షన్ చేశారు. మరో 150 గ్రామాలకు త్వరలో మంజూరు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సిటీ సెంటర్లో పెట్రోల్ బంక్
ఇందూర్ నగర నడిబొడ్డులో 10 గుంటల స్థలంలో మహిళా సంఘాల కోసం పెట్రోల్ బంక్ ఏర్పాటు కానుంది. ఇటీవల కూల్చేసిన డ్వాక్రా బజార్ ల్యాండ్ను దీనికోసం అలాట్ చేయనున్నారు. ల్యాండ్ సమస్యతో ఇన్నాళ్లు బంక్ నిర్మాణం ఆగింది.
మహిళలకు టాప్ ప్రయారిటీ
500 గజాల సర్కార్ ల్యాండ్ ఎక్కడున్నా 500 టన్నుల గోదాంమంజూరు చేస్తం. రైతులకు ఉపయోగపడే గోదాంలు ఎక్కువగా ఏర్పాటు చేస్తాం. వీఓ ఆఫీస్ నిర్మాణం మరో గొప్ప మార్పునకు నాందికాబోతున్నది. పెట్రోల్ బంక్ ఏర్పాటు ఫైనల్ స్టేజ్లో ఉన్నది.- సాయాగౌడ్, డీఆర్డీవో
