రైతుల రెక్కల కష్టం కృష్ణార్పణం.. వరదతో నీట మునిగిన మినుము, నువ్వుల పంట

 రైతుల రెక్కల కష్టం కృష్ణార్పణం.. వరదతో నీట మునిగిన మినుము, నువ్వుల పంట
  • కృష్ణా నదికి ముందస్తు వరదతో నీట మునిగిన మినుము, నువ్వుల పంట

నాగర్ కర్నూల్, వెలుగు: కృష్ణానదికి ముందస్తుగా వచ్చిన వరదలతో 5 వేల ఎకరాల్లో సాగు చేసిన మినుము, నువ్వుల పంట నీటిపాలైంది. నదిలో నీటి మట్టం తగ్గిన తరువాత ఆరుతడి పంటలు సాగు చేయడం కృష్ణాతీర ప్రాంత గ్రామాల్లో ఆనవాయితీగా మారింది. కొల్లాపూర్, పెంట్లవెల్లి, చిన్నంబావి మండలాల పరిధిలోని మల్లేశ్వరం, మంచాలకట్ట, ఏంకల్, జటప్రోల్, చెల్లపాడు, అయ్యవారిపల్లి, గడ్డ బస్వాపూర్​ గ్రామాల్లో 600 మంది రైతులు కృష్ణానదిలో మినుములు, నువ్వులు సాగు చేశారు. 

వానాకాలంలో కృష్ణానదికి వరద ప్రారంభానికి ముందే పంట కోతలు పూర్తి అయ్యి దిగుబడి ఇండ్లకు చేరేది. ఎగువన ఉండే మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురిసే వర్షాలతో కృష్ణా, తుంగభద్ర, ఇతర ఉపనదులకు జూన్​ చివర్లో లేదంటే జులై నెలలో వరద వచ్చేది. ఒక్కోసారి జూలై చివరి వారంలో వరద ప్రారంభమైన సందర్భాలు ఉన్నాయి. ఈసారి జూన్​ ప్రారంభంలోనే ప్రవాహం పెరగడంతో ఏటి ఒడ్డున వేసిన పంటలు నీట మునిగాయి. శ్రీశైలం రిజర్వాయర్​ నిర్మాణంతో కొల్లాపూర్​ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఏటి ఒడ్డున ఉన్న గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అప్పటి నుంచి నాలుగు నెలల్లో దిగుబడి వచ్చే పంటలను ఇక్కడి రైతులు సాగు చేస్తారు. ఏడాది పాటు ఇదే వారికి ప్రధాన జీవనాధారం. 

చాలా మందికి సొంత భూములు లేకపోవడం, కౌలు భూముల్లో సాగు నష్టాలు వస్తుండడంతో కృష్ణా నదిలో వరద ప్రారంభమైన తర్వాత వీరంతా వ్యవసాయ కూలీలుగా పనులు చేస్తారు. ఏటి ఒడ్డున ఉన్న నది పరివాహాక ప్రాంతంలోని భూములకు పట్టాలు ఉండవు. దీంతో నదిలో సాగు చేసే రైతులకు బ్యాంకు రుణాలు,  రైతు భరోసా, పంట నష్టపోతే ఇన్సూరెన్స్​ వచ్చే అవకాశాలు లేవు. 

కళ్లముందే నీట మునుగుతుంటే..

కృష్ణానదిలో నీటిమట్టం తగ్గిన తర్వాత అంటే మార్చి నెలలో పంటలు సాగు చేస్తారు. జూన్​ చివరి వరకు పంటలు కోస్తారు.ఈసారి ముందొచ్చిన వరదతో పంటలు నీట మునగడంతో పెట్టుబడి కింద తెచ్చిన అప్పు, భవిష్యత్​ గురించి ఆందోళన చెందుతున్నారు. కోసిన పంటను ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల మీద తరలించడానికి చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. చివరికి నదిలో వాడే బుట్టీలను తెచ్చినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోతున్నారు. 

10 ఎకరాల పంట నీళ్లలో ఉంది..

ఏటా జులై నెలలో వరద వచ్చేది. ఈసారి మే నెలలోనే వరద మొదలైంది.10 ఎకరాల్లో మినుములు, నువ్వుల పంట వేసిన. పెట్టుబడికి రూ.4 లక్షల ఖర్చు చేసిన. మా ఇంటిల్లాది రెక్కల కష్టం నీళ్లలో కలిసింది. నదిలో ప్రవాహం పెరగడంతో పంట చుట్టూ నీరు చేరింది. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు పోయే పరిస్థితి లేదు. ప్రభుత్వమే మా మీద దయ చూపాలే. - కృష్ణయ్య, మంచాలకట్ట