ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో గృహ అవసరాలతో పాటు విద్యాలయాలు, హాస్పిటల్స్ కు అవసరమైన ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్తో కలిసి గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, చమురు కంపెనీల సేల్స్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రతిరోజూ బుకింగ్, సరఫరా వివరాలపై నివేదిక సమర్పించాలని డీలర్లను ఆదేశించారు. ఆసుపత్రులు, వసతి గృహాలు, అనాథ శరణాలయాలకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా చేయాలని సూచించారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
