- లేదంటే ఉద్యమం తప్పదు: అల్లం నారాయణ
పంజాగుట్ట, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు కూడా క్యాష్లెస్ హెల్త్ కార్డులు మంజూరు చేసి, పక్కాగా హెల్త్ పాలసీని అమలు చేయాలని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీవో 64 ద్వారా జర్నలిస్టులకు అందించిన హెల్త్ కార్డులను ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.
నిన్నటి కేబినెట్ నిర్ణయాల్లో ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ప్రస్తావన ఉన్నప్పటికీ జర్నలిస్టుల ఊసే లేకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక అక్రెడిటేషన్లలో కోత విధించడం, ఉన్న కార్డులను తీసివేయడం శోచనీయమని మండిపడ్డారు. జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరిస్తే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. యూనియన్ నేతలు మారుతీ సాగర్, రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
