కన్నెపల్లి పంప్ హౌస్ కు పోటెత్తిన వరద..

కన్నెపల్లి పంప్ హౌస్ కు పోటెత్తిన వరద..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం కన్నెపల్లి పంపు హౌస్ లోకి భారీగా వరద నీరు చేరడంతో 17 బాహుబలి మోటార్లు నీట మునిగాయి. మోటార్లపైన 10 మీటర్ల ఎత్తు వరకు నీరు చేరింది. ఫలితంగా పంపు హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన మోటార్లు.. వరద నీటిని ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  దీంతో  భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వరద నీరు పెద్ద ఎత్తున చేరడంతో మోటార్లు మళ్లీ నడుస్తాయో లేదోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వరద వచ్చిన ప్రతీసారి మోటార్లు తడిసి పోవడం కామన్ అయిపోయింది. నీటిని ఎత్తిపోయాల్సిన మోటార్లు ఇలా వరద నీటిలో తడవడంతో వేలకోట్ల నష్టం వాటిల్లింది. అన్నారం పంప్ హౌస్ కూడా నీట మునిగింది.

కాగా కాళేశ్వరం దగ్గర  గోదావరి ఉగ్రరూపం  దాల్చింది. వరద నీరు ఉధృతంగా  ప్రవహిస్తుండడంతో అధికారులు రెండో  ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పుష్కర ఘాట్లు,  చిన్న చిన్న దుకాణాలు నీట మునిగాయి. వరద పోటెత్తుతుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 15.800  మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరుకుందని అధికారులు తెలిపారు. లక్ష్మీ బ్యారేజ్ కి వరద నీరు భారీగా చేరుకుంటుంది. రికార్డు స్థాయిలో ఇన్ ఫ్లో  వస్తున్నట్లు అధికారులు  చెబుతున్నారు. ఇన్ ప్లో  22 లక్షల  15 వేల760 క్యూసెక్కులు కాగా   ఔట్ ఫ్లో 22లక్షల 15 వేల 760 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు సరస్వతీ  బ్యారేజీలోకి  కూడా భారీగా వరద నీరు చేరుతోంది. బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసీలు  కాగా ప్రస్తుత నీటి మట్టం  8.38  టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు . ఇన్ ఫ్లో 14 లక్షల 77 వేల 975   క్యూసెక్కులు కాగా  ఔట్ ఫ్లో 14 లక్షల 77 వేల 975  క్యూసెక్కులు ఉంది.