TRS ఎంపీలకు ప్రజాస్వామ్యంపై నమ్మకంలేదు

TRS ఎంపీలకు ప్రజాస్వామ్యంపై నమ్మకంలేదు

పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంపై బీజేపీ ఎంపీ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. సభలో టీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. TRSపార్టీకి చెందిన ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంపై నమ్మకంలేని TRS నాయకులు నాడు గవర్నర్ ను అవమానించారని, నేడు రాష్ట్రపతిని కూడా అవమానించారని విమర్శించారు.

గవర్నర్ ప్రసంగంలో తమ సంవత్సరకాలపు అభివృద్ధి గురించి చెబుతారా? లేక ప్రతి పక్షాల గురించి చెబుతారా? అని అధికార టీఆర్ఎస్ ను ప్రశ్నించారు. ఈ కనీస జ్ఞానం లేని సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలంటూ వారి ఎంపీలను ఆదేశించడం నియంతృత్వ ఆలోచనలకు నిదర్శనం అని విమర్శించారు. గవర్నర్ ప్రసంగాన్ని,  రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడంతో తెలంగాణకు కలిగే కొత్త ప్రయోజనం ఏమీ ఉండదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించాలని బండి సంజయ్ అన్నారు.

ఇవాళ(సోమవారం) రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రధాని మోడీ నాయకత్వంలో గత సంవత్సర కాలంగా జరిగిన అభివృద్ధిని, కేంద్ర ప్రభుత్వ విజయాలను స్పష్టంగా వివరించారని తెలిపారు. తెలంగాణ ప్రజల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడన్నట్లుగా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే తెలంగాణ ప్రజల పక్షాన బీజేపీ పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

 మార్చి 25న  ఆర్ ఆర్ ఆర్ రిలీజ్