ఇండిగో విమానంలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ఇంటర్నెట్లో విమర్శలు కురిపిస్తుంది. ఒక ప్రయాణీకుడు కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి కావాలనే ఎయిర్ హోస్టెస్ ముందు చేతుల్లో నీరు పోసుకుని తాగాడు.
అసలు విషయం ఏంటంటే ఓ విమాన ప్రయాణీకుడు పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. ఈ వీడియోలో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇండిగో ఎయిర్ హోస్టెస్ అతనికి ఒక గ్లాసు నీళ్లు ఇస్తుంది. అయితే ఆ వ్యక్తి గ్లాస్ లో నీటిని మామూలుగా తాగకుండా, తన అరచేతుల్లోకి పోసుకుని అపరిశుభ్రంగా కనిపించే పద్ధతిలో తాగుతాడు.
ప్రయాణీకుడి ఈ వింత ప్రవర్తన చూసి ఎయిర్ హోస్టెస్ చాలా ఇబ్బందిపడుతూ, గందరగోళానికి గురై చూస్తూ నిలబడుతుంది. అతని ఫ్రెండ్స్ ఇదంతా వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
ఈ వింత చేష్ట చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించారు. కొందరు ప్రయాణీకుడు ఫ్లయిట్ సిబ్బందిని గౌరవించలేదని, ప్రాథమిక మర్యాదలు పాటించలేదని, కేవలం కంటెంట్ కోసం విచిత్రంగా ప్రవర్తించాడని మండిపడ్డారు.
ఒకరైతే.. పాపం.. ఎంత కష్టమైన పని.. ఎయిర్ హోస్టెస్ ఎలాంటి మనుషులతో డీల్ చేయాల్సి వస్తుందో అని అనగా మరొకరు ఇది చాలా చీప్ బోహేవియర్ అనగా.. ఇంకొకరు చాలా నీచమైన ప్రవర్తన ఇది అని అన్నారు.
ఈ విషయంపై ఇండిగో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే విమానాల్లో భద్రత, పరిశుభ్రత పక్కన పెట్టి ప్రయాణీకులు కేవలం రీల్స్ కోసం ఇలాంటివి చేయడంపై చర్చ మొదలైంది.
ఇంతముందు బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ ఓనర్ కూడా ఇండిగో విమానంలో తన బ్రాండ్ను పబ్లిక్గా ప్రమోట్ చేసి వైరల్ అయ్యాడు. ప్రశాంత్ అనే స్టార్టప్ ఓనర్ 'నువీ' అనే ప్రోటీన్ స్నాక్స్ బ్రాండ్ను నడుపుతున్నాడు. అతను విమానంలో తన ప్రొడక్ట్ను ప్రచారం చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో చాల వైరల్ అయింది. అతని ఈ మార్కెటింగ్ పద్ధతిపై నెటిజన్ల నుండి రకరకాల కామెంట్లు, విమర్శలు వచ్చాయి.
