
ఫిఫా వరల్డ్ కప్ 2022లో భాగంగా సెర్బియా, కామెరూన్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు జట్లు చెరో మూడు గోల్స్ సాధించడంతో..మ్యాచ్ డ్రా అయింది. దీంతో రెండు జట్లు చెరో పాయింట్ సాధించి గ్రూప్ Gలో కామెరూన్, సెర్బియా 3,4వ స్థానాల్లో నిలిచాయి.
https://twitter.com/CBSSportsGolazo/status/1597201697297793025
గోల్స్ వర్షం..
హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్లో 28వ నిమిషంలో చార్లెస్ కాస్టెల్లెట్ తొలి గోల్ సాధించడంతో..కామెరూన్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత గోల్ సాధించేందుకు సెర్బియా తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఫస్టాఫ్ లో మ్యాచ్ రిఫరీ..6 నిమిషాలు అదనపు సమయం కేటాయించడంతో..సెర్బియా పుంజుకుంది. 45+1 నిమిషంలో పావ్లోవిచ్ తొలి గోల్ కొట్టాడు. ఆ తర్వాత 45+3వ నిమిషంలో మిలిన్కోవిచ్ మరో గోల్ను సాధించడంతో..సెర్బియా ఫస్టాఫ్ లో 2–1తో అధిక్యంలోకి దూసుకెళ్లింది.
రెండో హాఫ్లో దూకుడు..
ఫస్టాఫ్ చివర్లో రెండు వరుస గోల్స్ సాధించి మాంచి జోరు మీదున్న సెర్బియాకు..సెకండాఫ్ లో 53 నిమిషంలో మిత్రోవిచ్ మరో గోల్ను అందించాడు. దీంతో సెర్బియా ఆధిక్యంల 3–1కి పెరిగింది. ఈ సమయంలో సెర్బియానే గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సమయంలో కామెరూన్ అద్భుతంగా ఆడింది. వరుసగా రెండు గోల్స్ కొట్టి..సెర్బియాకు చుక్కలు చూపించింది. సబ్స్ట్యూట్ విన్సెంట్ అబుబకర్ 63 నిమిషంలో గోల్ చేసి సెర్బియా ఆధిక్యాన్ని 3–2కు తగ్గించాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో 66వ నిమిషంలో చౌపో మోటింగ్ గోల్స్ సాధించి స్కోరును 3–3తో సమం చేశాడు. అనంతరం రెండు జట్లు గోల్ కొట్టేందుకు ఎత్తుకు పై ఎత్తు వేసినా గోల్ మాత్రం కొట్టలేకపోయాయి. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.