- సర్కార్కు ఇప్పటికే ప్రపోజల్స్ పంపిన అధికారులు
- జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చేలా కసరత్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల విధానంలో మార్పులు చేసేందుకు విద్యా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ స్కూళ్లలో ఆరో తరగతి నుంచే ప్రవేశాలు ఉండగా.. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఐదో తరగతికే స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి అధికారులు ఇప్పటికే ప్రపోజల్స్ పంపించారు. సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే 5, 6 తరగతుల్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లున్నాయి.
వీటిలో ఆరు నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన అందుబాటులో ఉంది. అయితే గురుకులాల్లో ఐదో తరగతి నుంచే క్లాసులు ప్రారంభం అవుతుండటంతో, ఇదే విధానాన్ని మోడల్ స్కూళ్లలోనూ పెట్టాలని అధికారులు భావించారు. దీనికి పర్మిషన్ కోసం సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రపోజల్ కు ఓకే చెబితే.. 5, 6 క్లాసులకు ఒకే సమయంలో ఎంట్రెన్స్ నిర్వహిస్తారు. పర్మిషన్ రావడం లేట్ అయితే మాత్రం.. ఎప్పటిలాగే 6వ తరగతి అడ్మిషన్ల కోసమే నోటీఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. దీనికి అనుగుణంగా జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
