
- గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన మూడు కేసుల్లో విచారణ
- సీఎం స్టేట్మెంట్ రికార్డు
- వచ్చే నెల 12న తుది తీర్పు
హైదరాబాద్, వెలుగు: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘంచారని సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసులు తుదిదశకు చేరుకున్నాయి. కోర్టు ట్రయల్స్లో భాగంగా గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం హాజరయ్యారు. గత ఎన్నికల ప్రచారాల్లో నమోదైన కేసులకు సంబంధించి న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సీఎం వివరణ ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ ను కోర్టు రికార్డు చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజు తుది తీర్పు వెల్లడించనుంది.
పీసీసీ చీఫ్గా ఉండి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద మూడు కేసులు నమోదయ్యాయి. నల్గొండ టూ టౌన్, బేగంబజార్ పీఎస్, మెదక్ జిల్లా కౌడిపల్లి పీఎస్ పరిధిలో నమోదైనఈ మూడు కేసుల్లో రేవంత్ రెడ్డి రెండుసార్లు వ్యక్తిగతంగా జడ్జి ముందు హాజరయ్యారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని న్యాయమూర్తి ముందు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. చార్జిషీట్లో పోలీసులు పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలని చెప్పారు. తాను ఎక్కడా ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేసింది. కేసు విచారణ పూర్తవుతున్న నేపథ్యంలో సీఎం కోర్టుకు హాజరు కావడం తప్పనిసరి అయింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్ వద్ద ఎవ్వరినీ అనుమతించలేదు.