
- జిల్లా రైతులను మంచిగా చూసుకోండి: సీఎం రేవంత్ రెడ్డి
- కీలక శాఖలన్నీ ఖమ్మం మంత్రుల వద్దే ఉన్నాయని వెల్లడి
- వీడియో కాన్ఫరెన్స్లో ఆదర్శ రైతులతో సీఎం సరదా సంభాషణ
నేలకొండపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా వాళ్లు చాలా తెలివైన వాళ్లని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఆర్థిక, వ్యవసాయ, రెవెన్యూ, గృహ నిర్మాణ తదితర కీలక శాఖలన్నీ ఆ జిల్లా మంత్రుల దగ్గరే ఉన్నాయని.. అందరూ రైతులను బాగా చూసుకోవాలని సూచించారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలానికి చెందిన రైతులతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందుగా మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మంకె రామకృష్ణ ముఖ్యమంతితో మాట్లాడుతూ..‘‘ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు నేస్తం కార్యక్రమంలో మొదటి నుంచి 57 ఎపిసోడ్లలో పాల్గొంటున్నాను.
ఇప్పుడు 58వ ఎపిసోడ్లో మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాస్త్రవేత్తలే కాకుండా ఇంకా అనేక రంగాల్లో ఉన్న అభ్యుదయ రైతులతో కూడా చాలా విషయాలు చెప్పించారు. దీనివల్ల మాకు ఎంతో విజ్ఞానం వస్తుంది సార్. ఇటువంటి కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడి వ్యవసాయ విజ్ఞానాన్ని స్టడీ చేయడం కోసం తమిళనాడు నుంచి అగ్రికల్చర్ టీములు కూడా వచ్చి.. తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కార్యక్రమం బాగుందని చెప్పారు.
ఇప్పుడు మండలానికి మూడు రైతు వేదికల ద్వారా రైతులకు వ్యవసాయ విజ్ఞానం అందిస్తున్నారు”అని అన్నారు. రైతుల కోసం ఇవన్నీ చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తన తరఫున, ఖమ్మం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలిపారు. అనం తరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన శాఖలన్నీ ఖమ్మం జిల్లా మంత్రుల వద్దే ఉన్నాయని సరదాగా మాట్లాడారు. పంటలు కూడా బాగా పండించుకోవాలని.. అందరూ కలసి రైతులకు మంచి చేయాలని సూచించారు.