
- కేంద్ర మైనారిటీ శాఖ ద్వారా ఇస్తున్నమన్న కిషన్రెడ్డి
ముషీరాబాద్, వెలుగు: చేతి వృత్తుల కళల రక్షణ, కళాకారుల ప్రోత్సాహం కోసం కేంద్ర మైనారిటీ శాఖ ఏటా రూ.730 కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చేతి వృత్తుల పరిరక్షణకు ‘హునార్ హాత్’ ఎంతో తోడ్పడుతోందన్నారు. దీని ద్వారా కళాకారులకు ఉపాధి కల్పించడం కోసం కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ, మైనారిటీ శాఖల ఆధ్వర్యంలో 37వ హునార్ హాత్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రాష్ట్ర హోం మంత్రి మహ్మూద్ అలీ, ఎంపీ సురేశ్రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందర్రావుతో కలిసి ఆయన దానిని ప్రారంభించారు. కళాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన హునార్ హాత్ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ఎగ్జిబిషన్ కోసం ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా.. తెలంగాణలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హునార్ హాత్లో 700 మందికిపైగా కళాకారులు తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ను ప్రదర్శనకు పెట్టారని చెప్పారు.
బ్యాంకు రుణాలిచ్చేందుకు సిద్ధం: నఖ్వీ
చేతి వృత్తుల కళాకారులను ప్రోత్సహించడం కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని, వారికి బ్యాంకు రుణాలిచ్చేందుకూ కేంద్ర మైనారిటీ శాఖ సిద్ధంగా ఉందని అబ్బాస్ నఖ్వీ చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా హునార్హాత్లో ప్రజలు తమకు ఇష్టమైన కళారూపాలను కొనుగోలు చేయవచ్చని, దాని వల్ల కళాకారులకు లాభం కలగుతుందని పేర్కొన్నారు. దేశమంతటా తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా వారి ఆదాయం మెరుగవుతుందన్నారు. ఏడేండ్లలో సుమారు 8 లక్షల మంది చేతివృత్తుల కళాకారులకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పించిందని చెప్పారు.