తీహార్​ జైలుకు కవిత .. ఏప్రిల్​ 9 వరకు జైలులోనే ఉండనున్న ఎమ్మెల్సీ

తీహార్​ జైలుకు కవిత .. ఏప్రిల్​ 9 వరకు జైలులోనే ఉండనున్న ఎమ్మెల్సీ
  • బెయిల్​ వద్దన్న ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు
  • కొడుకుకు పరీక్షలున్నాయని బెయిల్ కోసం పిటిషన్​
  • వచ్చే నెల 1న మధ్యంతర బెయిల్​పై విచారణ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ స్పెషల్ కోర్టు 14 రోజులు జ్యుడీషియల్​ రిమాండ్​ విధించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమె వచ్చే నెల 9 వరకు తీహార్​ జైల్లోనే ఉండనున్నారు. కస్టడీలో ఉన్న కవితకు మంగళవారం ఉదయం 10 గంటలకు  రోజువారి వైద్య పరీక్షలు నిర్వహించారు.

గతంలో ఇచ్చిన 10 రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈడీ తరఫున అడ్వొకేట్ జోహెబ్ హుస్సేన్, కవిత తరఫున విక్రం చౌదరి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు కొనసాగించారు. తొలుత ఈడీ తరఫు వాదనలు కొనసాగగా.. కవితను 14 రోజులు జ్యుడీషియల్​ రిమాండ్​కు పంపాలని అడ్వొకేట్​ హుస్సేన్​ కోరారు. కవిత కేసు దర్యాప్తునకు సహకరించడంలేదని కోర్టుకు నివేదించారు. ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో కవిత ప్రధాన కుట్రదారు, లబ్ధిదారురాలని ఈడీ ఆరోపించింది.

ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి లిక్కర్ స్కామ్​కు పాల్పడ్డారని పేర్కొన్నది. ఇందులో రూ.100 కోట్లు హవాలా రూపంలో చేతులు మారాయని తెలిపింది. అందుకే ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, సెక్షన్ 19 ప్రకారం ఈ నెల 15 న ఆమెను అరెస్ట్ చేసినట్టు వివరించింది. ఒకవేళ కవితను రిలీజ్ చేస్తే  లిక్కర్ స్కాం దర్యాప్తునకు ఆటంకాలు సృష్టించవచ్చని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున కవితకు బెయిల్ నిరాకరించాలని కోరింది.

ఈ వాదనలపై కవిత తరపు న్యాయవాది విక్రం చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. రెగ్యులర్​ బెయిల్ దాఖలు చేశామని, ఈ విషయంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. పీఎంఎల్ఏ యాక్ట్  సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన కవిత స్టేట్​మెంట్​ను ప్రిజర్వ్ చేయాలని కోరారు. ఈ వాదనలపై జోక్యం చేసుకున్న ఈడీ తరపు న్యాయవాది కవిత బెయిల్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని కోరారు. 

మధ్యంతర బెయిల్​ మంజూరుకు కవిత వినతి

మరోసారి విక్రం చౌదరి వాదనలు కొనసాగిస్తూ.. కవితకు 16 ఏండ్ల కొడుకు ఉన్నాడని, తనకి 11 వ తరగతి పరీక్షలకు షెడ్యూల్ రిలీజ్ అయిందని కోర్టుకు తెలిపారు. మంగళవారం నుంచే ఈ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో.. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 16 వరకు కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కాగా, దాదాపు 12గంటలకు ఇరువైపు వాదనలు ముగుస్తున్నట్టు పేర్కొన్న స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా.. కవిత జ్యుడీషియల్​ కస్టడీ, బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును అరగంటకు రిజర్వ్ చేశారు.

దీంతో కోర్టు హాల్ లోనే కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని కవిత తరపు న్యాయవాది విజ్ఞప్తి చేయడంతో జడ్జి పర్మిషన్​ ఇచ్చారు. దీంతో భర్త అనిల్, కుటుంబ సభ్యులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇతర పార్టీ నేతలతో కవిత కాసేపు ముచ్చటించారు. అనంతరం ఒంటి గంటకు వెలువరించిన తీర్పులో కవితకు 14 రోజులు జ్యుడీషియల్​ రిమాండ్​ విధిస్తున్నట్టు జడ్జి కావేరి బవేజా పేర్కొన్నారు. ఏప్రిల్ 9 న ఉదయం తిరిగి కోర్టు ముందు కవితను ప్రొడ్యూస్ చేయాలని ఆదేశించారు. అలాగే కవిత పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పై ఏప్రిల్ 1 మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని వెల్లడించారు. అనంతరం పోలీసులు కవితను తీహార్​ జైలుకు తరలించారు.  

జైల్లో ఆభరణాలు ధరించేందుకు అనుమతి

తీహార్ జైల్లో కవిత ఆభరణాలు ధరించేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. మొత్తం 9 పేజీలతో కూడిన కవిత రిమాండ్ ఉత్తర్వులను సీబీఐ స్పెషల్ కోర్టు జారీ చేసింది. ఇందులో కవిత పెట్టుకొన్న పలు విజ్ఞప్తులను కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. ఆమె పెట్టుకున్న ఆరు విజ్ఞప్తులను అంగీకరిస్తూ.. రౌస్ ఎవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీహార్ జైలు సూపరింటెండెంట్​కు ఆదేశాలు జారీ చేశారు. ఇంటి భోజనంతోపాటు పడుకొనేందుకు మంచం, పరుపులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి మంజూరు చేశారు.

వీటితోపాటు పెన్ను, పేపర్లు, మందులు తీసుకెళ్లేందుకు అనుమతించారు. అయితే, కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని వైద్యపరీక్షలకు సంబంధించిన రికార్డులను ఆమె తరపు న్యాయవాదులకు అందజేయాలని ఈడీని జడ్జి ఆదేశించారు. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ ఒకటి నాటికి సమాధానం ఇవ్వాలని సూచించారు. లిక్కర్​ పాలసీ కేసులో ఇప్పటికే ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఖరారు చేస్తూ.. అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను సీల్డ్ కవర్ లో కవిత న్యాయవాదులకు ఇవ్వాలని ఆదేశించారు. ఈ రికార్డులను ‘కాన్ఫిడెన్షియల్’గానే ఉంచాలని కవిత న్యాయవాదులకు కోర్టు సూచించింది.

ఈడీ ముందుకు శ్రీ శరణ్ 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్తగా తెరపైకి వచ్చిన కవిత మేనల్లుడు మేక శ్రీ శరణ్  మంగళవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించి జరిగిన నగదు బదిలీ/ వినియోగం నేర ప్రక్రియలో మేక శరణ్ ఉన్నట్టు ఈడీ ఆరోపిస్తున్నది. ఈ నేర ప్రక్రియ సమాచారం శరణ్ దగ్గర ఉన్నదని, ఆయన కేసు దర్యాప్తునకు సహకరించడం లేదని ఈడీ ఇటీవల కోర్టుకు తెలిపింది. కవిత తరపున సౌత్ గ్రూప్ నుంచి నగదు లావాదేవీలు/వినియోగం, బదిలీలు వంటి కీలక వ్యవహారాలన్నీ శరణ్​ కనుసన్నల్లో నే జరిగాయని ఆరోపించింది.

ఈ నెల 15 న కవిత ఇంట్లో నిర్వహించిన సోదాల టైంలో మేక శరణ్ ఫోన్ ను సీజ్ చేశామని, అలాగే పీఎంఎల్ ఏ సెక్షన్ 17 ప్రకారం.. శనివారం(23.03.24) న శరణ్ ఇంట్లో సోదాలు చేపట్టినట్టు తెలిపింది. ఆ తర్వాత విచారణకు హాజరుకావాలని రెండుసార్లు ఆదేశించినా ఆయన రాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో శరణ్ మంగళవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఒకవైపు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఈడీ అధికారులు.. మరోవైపు ఈడీ హెడ్ ఆఫీసులో శరణ్ ను విచారించారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, ఆమె ఆదేశాలనుసారంగా సాగిన నగదు బదిలీలు/వినియోగం, సమీర్ మహేంద్రుతో శరణ్ చేసిన డీలింగ్స్ వంటి అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది.

పోలీస్ వ్యాన్​లో తరలింపు

కోర్టు 14 రోజులు జ్యుడీషియల్​ రిమాండ్​ విధించడంతో కవితను పోలీస్ వ్యాన్ లో తీహార్ జైలుకు తరలించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. అనంతరం రౌస్ ఎవెన్యూలోని కోర్టు హాల్ నుంచి ఆమెను అదే బిల్డింగ్ లోని లాకప్ రూం కు తరలించారు.  తర్వాత ఈడీ అధికారులు కవితను పోలీసులకు అప్పగించారు. లాకప్ రూంలోనే వైద్య సిబ్బంది కవితకు బీపీ, షుగర్​ లెవల్స్ చెక్ చేశారు.

దాదాపు నాలుగు గంటల తర్వాత.. సాయంత్రం 4:54 గంటలకు ఆమెను పోలీస్ వ్యాన్ లో జైలుకు తరలించారు. ఎలాంటి భద్రతా సమస్యలు ఎదురు కాకుండా లాకప్ రూంలోకే పోలీస్ వ్యాన్ ను తీసుకెళ్లారు. ఆమెను లోపలే వ్యాన్ లోకి ఎక్కించుకొని నేరుగా జైలుకు తీసుకెళ్లారు. కవితను జైలుకు తరలించే వరకు ఆమె భర్త అనిల్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ ఇతర నేతలు, కవిత అభిమానులు లాకప్ రూం ముందే పడిగాపులు కాశారు.

జైల్లో కవితకు స్పెషల్​ రూం

సాయంత్రం 6 గంటలకు కవిత తీహార్​ జైలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీబీఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులను పోలీసులు జైలు సూపరింటెండెంట్​కు అందజేశారు. అనంతరం జైలు అధికారులు కవితకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిసింది. అనంతరం ఆమెకు ప్రత్యేక రూం ను కేటాయించారు. కాగా ఆర్డర్​లో మెన్షన్ చేసిన పలు వెసులుబాట్లను పరిగణనలోకి తీసుకొని.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. అలాగే, ప్రస్తుతం అండర్ ట్రయల్ నిందితురాలిగా ఉన్న కవితకు జైలు అధికారులు పలు సౌకర్యాలు కల్పించనున్నట్టు సమాచారం.