గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భారీ ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఒకే పనికి రెండుసార్లు బిల్లులు చెల్లించి, నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం జీహెచ్ఎంసీలో కలకలం రేపుతోంది.
విషయం బయటకు పొక్కడంతో అప్రమత్తమైన అధికారులు, కాంట్రాక్టర్ల నుంచి హడావుడిగా డబ్బులు వెనక్కి వసూలు చేసే పనిలో పడ్డారు. ఇప్పటివరకు దాదాపు 11 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ. 7 కోట్లు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని.. ఏకంగా 70 కోట్ల రూపాయలకు పైగా డబుల్ బిల్లులు చెల్లించినట్లు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్.. వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ నివేదికలో ఒకే పనికి రెండు సార్లు బిల్లులు ఇవ్వడమే కాకుండా, చెల్లించాల్సిన దానికంటే అధికంగా ఎక్సెస్ బిల్లులు చెల్లించినట్లు నిర్ధారణ అయింది. ఈ భారీ ఫైనాన్షియల్ ఫ్రాడ్కు బాధ్యుడిగా భావిస్తూ.. జీహెచ్ఎంసీ ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్ చంద్రను కమిషనర్ విధుల నుంచి తప్పించారు. అలాగే ఓ కంప్యూటర్ ఆపరేటర్ను టర్మినేట్ చేసేందుకు అధికారులు ఫైల్ సిద్ధం చేస్తున్నారు.
►ALSO READ | మట్టి వినాయకులు వాడాలి.. మొక్కలు పంపిణీ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్తో పూర్తి స్థాయి విచారణ జరిపిస్తేనే ఈ డబుల్ బిల్లుల బాగోతం ఎంతవరకు ఉందనేది స్పష్టమౌతుందని అధికారులు అంటున్నారు. అయితే ఇంతటి భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన వారిపై కేవలం బదిలీలు, విధుల నుంచి తొలగించడమే తప్ప.. క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయకపోవడంపై ఇప్పుడు బల్దియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
